జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు
జడ్చర్ల, ఏప్రిల్ 23: అధ్వాన్నమైన పార్టీ బీజేపీ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల చంద్రాగార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర స్టడీ సర్కిల్ ఇన్చార్జి పాలాది రామ్మోహన్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి తామే అంతా అన్నట్లు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఒకప్పుడు హిట్లర్ ప్రపంచంపై దండయాత్ర చేసి అన్నీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూశాడన్నారు. ఇప్పుడున్న బీజేపీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో అధికారం వారిదే కావాలని, మిగతా ఏ పార్టీలు ఉండకూడదనే ధోరణి కనిపిస్తున్నదని ఆరోపించారు. వాజపేయి, అద్వాని హయాంలో సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కొనసాగిందన్నారు. అనంతరం పార్టీలో చేరిన పాలాది రామ్మోహన్ మాట్లాడుతూ 29ఏండ్లుగా బీజేపీలో ఉన్నానని, ఇన్నాళ్లు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి పార్టీకి, ప్రజలకు సేవ చేశానని తెలిపారు.
జాతీయభావం గల వారిని విస్మరించి కొత్త వారు వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీంతో ఎవరికీ సాయం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పారు. సిద్ధాంతాలు లేని పార్టీలో ఆత్మగౌరవం చంపుకొని పనిచేయలేమని, అందుకే టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. పాలాది రామ్మోహన్ ఆధ్వర్యంలో బీజేపీ రైతు సంఘం రాష్ట్ర నేత వడ్లశేఖర్, వెంకటేశ్గౌడ్, ఆటో యూనియన్ ఉద్యోగులు శ్రీను, సీనియర్ నేత నర్సింహులు, అంజి, రవి, శ్రీను, రంజిత, ఆజం, శ్రీరామరెడ్డి, శివనాథ్, శ్రీశైలం, మల్లేశ్, హనుమాన్వీధి భరత్, మూర్తి, చందు, బాలు, ఆంజనేయులుతోపాటు 200లకుపైగా నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరడంతో జడ్చర్లలో బీజేపీ దాదాపు ఖాళీ అయ్యింది. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, అందెబాబయ్య, మాలిక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, మురళి, మల్లేశ్, రేణుక, ఇర్ఫాన్, నారాయణగౌడ్, నాగిరెడ్డి, ప్రశాంత్రెడ్డి, రమేశ్, లత, చైతన్య పాల్గొన్నారు.