జమ్మికుంట, జూలై 6: ఈటల రాజేందర్ తన హయాంలో శామీర్పేట గడిలో కూర్చొని నాయకులందరినీ అడ్డా కూలీలుగా మార్చాడని కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి విమర్శించారు. నమ్మిన వారిని మోసంచేయడం ఆయన నైజమన్నారు. ఈటలది నియంత పోకడని, సొంత ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈటలతో కలిసి బీజేపీలో చేరిన సమ్మిరెడ్డి రెండ్రోజుల క్రితం తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు. మంగళవారం జమ్మికుంటలోని వినాయక గార్డెన్లో సమ్మిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈటల తీరుపై మండిపడ్డారు. ఈటల సీఎం పీఠంపై కన్నేశాడని, ప్రభుత్వ పథకాలను హేళన చేశాడని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిపారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయినా ఆయన వెన్నంటే ఉన్నామని గుర్తుచేశారు. చేసిన తప్పు లు సరిదిద్దుకొని పార్టీలోనే ఉంటాడని తాము అనుకున్నామని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారులపై పట్టులేకుండా నాణ్యత లేని పనులు చేయించినట్టు ఆరోపించారు. ఇటీవల ఈటల పార్టీని వీడిన తర్వాత ఆయన వెంట ఉన్నానని, మతతత్వ పార్టీ అయిన బీజేపీలో చేరడం నచ్చలేదని పేర్కొన్నారు. ప్రజలు కూడా బీజేపీని ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్నారు. బీజేపీకి ఇక్కడ స్థానం లేదని, టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తామని పేర్కొన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసే ఈటల ఓటమి కోసం పనిచేస్తానని సమ్మిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం పాల్గొన్నారు.