బంజారాహిల్స్,మే 19: ప్రేమించి పెండ్లి చేసుకున్న లేడీ కానిస్టేబుల్ను వేధింపులకు గురిచేయడంతో పాటు కులం పేరుతో దూరంపెడుతున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసముంటున్న మునిగడప సంధ్యారాణి(28) ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నది. భర్త చనిపోవడంతో కుమార్తెతో కలిసి నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సమయంలో రెండేండ్ల కిందట కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన పూసల చరణ్తేజ(24) పరిచయం అయ్యాడు. ఏడాది కిందట ఆమెకు పోలీసుశాఖలో ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ప్రేమిస్తున్నానంటూ చరణ్తేజ చెప్పడంతో పెండ్లికి అంగీకరించింది.
తనకు గతంలోనే పెండ్లి అయ్యిందని, పాప కూడా ఉందని, ఆమె తమతోనే ఉంటుందన్న షరతుతో సంధ్యారాణి గత ఏడాది నవంబర్ 7న కూకట్పల్లిలోని ఆర్యసమాజ్లో చరణ్తేజను పెండ్లిచేసుకుంది. అయితే పెండ్లి అయిన రెండునెలలనుంచే చరణ్తేజతో పాటు అతడి కుటుంబసభ్యులు కులంపేరుతో దూరం పెట్టారు. విడాకులు ఇవ్వాలని లేకుంటే అంతుచూస్తామంటూ బెదిరించారు. అంతేకాకుండా సంధ్యారాణి క్యారెక్టర్ మంచిది కాదంటూ ప్రచారం చేశారు. మార్ఫింగ్ ఫొటోలు తయారు చేసిన చరణ్తేజ.. వాటిని చూపిస్తూ తరచూ కొట్టడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారు.
అంతేకాకుండా వారంరోజుల కిందట ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. చరణ్తేజ తండ్రి బహ్మం, తల్లి పూసల సంధ్యారాణి, సోదరి వెన్నెల తదితరులు బాధితురాలికి ఫోన్ చేసి చరణ్తేజను వదిలిపెట్టాలని హెచ్చరించారు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు చరణ్తేజతో పాటు అతడి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడు చరణ్తేజను పోలీసులు అరెస్ట్ చేశారు.