హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల కబ్జా ఫిర్యాదులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సీరియస్ అయ్యారు. తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి మంత్రి ఈటల రాజేందర్ వందల ఎకరాలు ఆక్రమించినట్లుగా సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు కేటాయించిన భూములను మంత్రి ఈటల రాజేందర్ బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. పౌల్ట్రీ పరిశ్రమ ప్రారంభించేందుకు మంత్రి, అతని అనుచరులు తమ భూములను స్వాధీనం చేసుకున్నట్లు మసాయిపేట మండలంలోని అచంపేట, హకీంపేటకు చెందిన ఎనిమిది మంది గ్రామస్తులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను వెంటనే తిరిగి అప్పగించాల్సిందిగా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తమకు కేటాయించిన అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని చెప్పి, బలవంతంగా మంత్రి, అతని సహచరులు తమ భూ పత్రాలను తీసుకున్నట్లు పిటిషనర్లు ఆరోపించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి దాదాపు 100 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై స్పందించిన సీఎం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
వెలుగులోకి మంత్రి ఈటల భూకబ్జా బాగోతం..