లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో వివాహం చేసుకున్నారు. శనివారం వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్లో క్యారీ సైమండ్స్ను రహస్యంగా పెళ్లాడినట్లు బ్రిటన్ పత్రికలు పేర్కొన్నాయి. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన వేడుకలో నెచ్చెలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉండడంతో పెళ్లి కార్యక్రమానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంది. దీనిపై బోరిస్ జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయ ప్రతినిధిని సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు.
జాన్సన్కు ఇది మూడో వివాహం కాగా.. 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్ధం చేసుకున్నట్లు జాన్సన్, సైమండ్స్ ప్రకటించారు. బ్రిటన్ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు కాగా.. క్యారీ సైమండ్స్కు 33 సంవత్సరాలు. వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. 2019లో జాన్సన్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరూ డౌనింగ్ స్ట్రీట్లో కలిసి నివసిస్తున్నారు. 1822లో లార్డ్ లివర్పూల్ తర్వాత బ్రిటన్ ప్రధాని పదవిలో ఉంటూ వివాహం చేసుకున్న తొలి వ్యక్తి బోరిస్ జాన్సన్.
బోరిస్ జాన్సన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనను ఒకసారి కన్జర్వేటివ్ పార్టీ విధాన బృందం నుంచి తొలగించారు. ఆయన రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. అయితే తనకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పేందుకు నిరాకరించారు. జాన్సన్ చివరి వివాహం మెరీనా వీలర్ అనే న్యాయవాదితో జరిగింది. వీరికి నలుగురు సంతానం ఉండగా.. ఇద్దరు విడిపోయినట్లు 2018 సెప్టెంబర్లో ప్రకటించారు.