ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. అక్షయ త్రితియ సందర్భంగా.. కర్కాటక లఘ్నం.. అభిజిత్ ముహూర్తంలో.. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు.. ఆలయ ద్వారాలను ఓపెన్ చేశారు. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయాన్ని ముందు తెరుస్తారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో చార్ధామ్ యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం ఆలయ పూజారులు, అధికారులు మాత్రమే ఇవాళ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 25 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వరుసగా రెండవ ఏడాది పెద్దగా భక్తులు లేకుండానే యమునోత్రి ఆలయాన్ని తెరవడం విశేషం. సర్వ జగత్తును రోగాల నుంచి విముక్తి చేయాలని పురోహితులు ఆ దేవతను ప్రార్థించారు. ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత తొలి పూజను ప్రధాని మోదీ పేరిట నిర్వహించినట్లు పురోహితులు పవన్ ఉనియాల్ తెలిపారు. శనివారం గంగోత్రి, సోమవారం కేదార్నాథ్, మంగళవారం బద్రీనాథ్ ఆలయాలను కూడా తెరవనున్నారు. కానీ భక్తులకు మాత్రం ప్రవేశం ఉండదు.