నిథిల్ భరద్వాజ్ 28 ఏండ్ల పిలగాడు.ఢిల్లీలోని ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగం చేసేవాడు. ఐదారేండ్లు బాగానే చేసిండు. కానీ, ఉద్యోగం బోర్ కొట్టింది. వదిలేసి ఊరికెళ్లిపోయిండు. మూలాలను వెతుక్కున్నాడు.తాతముత్తాతలు వ్యవసాయమే చేసేది కాబట్టి, తానూ అదే చేయాలని నిర్ణయించుకున్నాడు.ఇప్పుడు, అతడొక లాభాల రైతు.
ట్రైనింగ్ సెంటర్
పట్నా, బిహార్ పరిసర ప్రాంతాల రైతులు సాధారణంగా మక్కజొన్న, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు, వరి పండిస్తారు. నిథిల్ భరద్వాజ్ మాత్రం ముత్యాల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నాడు. ముత్యాల ద్వారా లక్షలు సంపాదించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో మధ్యప్రదేశ్లోని బొమోరియా పెర్ల్ ఫామ్లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడే కొన్ని నెలలు పనిచేశాడు. తిరిగి మురేరాకు వచ్చి ముత్యాల పెంపకం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సహకారంతో తన పొలంలో ఎకరం విస్తీర్ణంలో చెరువు తోడించాడు. ‘బంగారం లాంటి పొలాన్ని పాడు చేసుకుంటున్నావ్. హాయిగా ఢిల్లీలో ఉద్యోగం చేసుకోక ఈ కథలేంటి?’ అని చాలామంది అన్నారు. కానీ, అతడు మాత్రం పట్టించుకోలేదు. ముత్యాల పెంపకమే లక్ష్యంగా పనిచేశాడు. తర్వాత ఊర్లోనే ‘భరద్వాజ్ పెర్ల్ ఫామ్ అండ్ ట్రైనింగ్ సెంటర్’ను స్థాపించి మరో ఆరుగురికి ఉపాధి చూపించాడు.
మంచి డిమాండ్
2019లో నిథిల్ తన చెరువులో 400 గుల్లలను నాటాడు. ఒక ఎకరం చెరువులో 25 వేల నుండి 30 వేల గుల్లలు ఉంటాయి. కానీ, అదంతా తనకు తెలియని పని. కాబట్టి, ఒక్కసారే పెద్ద పోకడకు వెళ్లి తర్వాత నష్టం జరిగితే బాధపడకూడదన్న ఉద్దేశంతో చిన్నగా ప్రారంభించాడు. ఇరవై అయిదు వేలు పెట్టుబడి పెట్టాడు. 8-10 నెలలు గుల్లలు పెంచిన తర్వాత, వాటిని అమ్మేశాడు. అలా, 75 వేలు మిగిలాయి. ప్రతి ఆయిస్టర్ (గుల్ల చేప)కు సుమారు 40 రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక ఆయిస్టర్ రెండు ముత్యాలను ఉత్పత్తి చేస్తుంది. వాటిలో ప్రతి ముత్యం సగటున 120 రూపాయల ధర పలుకుతుంది. నాణ్యమైన ముత్యానికి రెండొందల వరకూ వస్తాయి. వాటిని వెంటనే మార్కెట్ చేయకుండా, ఇన్క్యుబేటర్లో నిల్వ చేసి మార్కెట్లో డిమాండ్ ఉన్న సీజన్లోనే అమ్ముతున్నాడు.
చేపల పెంపకమూ..
గత సంవత్సరం నిథిల్ సుమారు 25 వేల ముత్యాలను వేశాడు. పెంపకం అయిపోయే సరికి 30 లక్షల రూపాయలు సంపాదించవచ్చని అంచనా వేస్తున్నాడు. ఇప్పటివరకు రూ .3.6 లక్షలు ఆర్జించాడు. 2021 అక్టోబర్ వరకూ ముత్యాలను తీయొచ్చు. ముత్యాలు పొదిగే సమయంలో చెరువును ఉత్తగానే వదిలేస్తే ప్రయోజనం ఏముంటుందని చేపలనూ పెంచు తున్నాడు. అయితే చేపల పెంపకం వల్ల ఆయిస్టర్లకు ప్రమాదం కాబట్టి, శాకాహార చేపలనే పెంచుతున్నాడు. వీటివల్ల ఎలాంటి హానీ జరగదు. ఇలా, ఒక్క సీజన్లో చేపల నుంచి రూ.2.5 లక్షలు సంపాదిస్తున్నాడు.
మత్స్యశాఖ సహకారం
నిథిల్ వ్యవసాయం గురించి తెలుసుకున్న మత్స్యశాఖ అధికారులు ఆయనను సంప్రదించారు. ‘ఇంత ఒడుపుతో ముత్యాలు, చేపలు పెంచుతున్నావు. నీకు సహకారం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే, ఓ సంస్థ ఏర్పాటుచేసి, సర్కారు తరఫున మరికొందరికి శిక్షణ ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. నిథిల్కు ఈ ఆఫర్ నచ్చింది. దీంతో బ్యాచ్లవారీగా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాడు. ఒక్కో బ్యాచ్లో 15 మంది శిక్షణార్థులు ఉంటారు. ప్రతి బ్యాచ్ వీడ్కోలు సమావేశంలో నిథిల్ ‘ముత్యాల పెంపకం మరీ అంత సులువైన పని కాదు. వ్యూహంతో పనిచేస్తే లాభం వస్తుంది’ అని సూచిస్తున్నాడు.