భువనేశ్వర్ : కోవిడ్ వ్యాక్సిన్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ ప్రధాని మోదీ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధీనంలోనే కాకుండా.. బహిరంగ మార్కెట్లో కూడా కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, దాని వల్ల ఆ టీకాలు కావాలనుకున్న వారు కొనుగోలు చేసుకుంటారని, ఇలా చేయడం వల్ల అణగారిన వర్గాలపై ఎక్కవ ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని సీఎం పట్నాయక్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన టీకాలను అందరికీ అందబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు సహకరించాలన్నారు.
మెట్రో నగరాలను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ పంపిణీ రేషనల్ పద్ధతిలో జరగాలన్నారు. కొన్ని మెట్రో నగరాల్లో కేసులు అధికంగా ఉన్నాయని, కానీ ఆ నగరాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సాగుతుందని, ఈ అంశాన్ని దృష్టిలోపెట్టుకుని ఆయా నగరాల్లో వ్యాక్సినేషన్ కోసం కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరారు. ఎందుకంటే ఆ నగరాల్లో లాక్డౌన్ విధిస్తే, దాని వల్ల మిగితా దేశంపై ప్రభావం పడుతుందన్నారు. వ్యాక్సినేషన్ కోసం వయసు విషయంలో సడలింపు ఇవ్వాలన్నారు.
ఒడిశా రాష్ట్రంలో ఇప్పటి వరకు 47 లక్షల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చినట్లు చెప్పారు. వారిలో హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏళ్లు దాటినవారున్నారని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పట్నాయక్ తెలిపారు. ప్రతి రోజు 3 లక్షల మంది వ్యాక్సిన్ ఇచ్చే సామర్థం తమ రాష్ట్రానికి ఉందని, అలా చేస్తే రాష్ట్రం మొత్తం వ్యాక్సినేట్ చేసేందుకు 160 రోజుల సమయం పడుతుందని పట్నాయక్ తన లేఖలో పేర్కొన్నారు.