రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ములుగులో టీ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
ములుగు, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆరోగ్యరంగం మౌలిక వసతుల కల్పనతో బలోపేతం అవుతున్నదని, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖానలో రూ.3కోట్లతో ఏర్పాటుచేసిన టీ డయాగ్నస్టిక్ సెంటర్ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత సెంటర్లోని అత్యాధునిక యంత్రాలను పరిశీలించి వాటి పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొని స్వయంగా రక్తపరీక్ష చేయించుకున్నారు. అంతకుముందు గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించి ఆలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. బడ్జెట్లో కేటాయించిన దాని కంటే అదనంగా రూ.10వేల కోట్లను ఆరోగ్య రంగంలో ఖర్చు పెట్టడంతో వైద్యరంగం దశ, దిశ మారనుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలనే ఆలోచనలతో సీఎం కేసీఆర్ ములుగు జిల్లాతో పాటు సిరిసిల్ల జిల్లాను మోడల్ జిల్లాగా ప్రకటించి జిల్లాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా, గిరిజన బిడ్డగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. హెల్త్ ప్రొఫైల్ వివరాలు ఉన్నట్లయితే సరైన సమయంలో సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుందని అన్నారు. త్వరలో గుండె సంబంధిత పరీక్షలను సైతం టీ డయాగ్నస్టిక్ సెంటర్లో పేద ప్రజలకు ఉచితంగా చేయనున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టిందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండి జీరోస్థాయికి తీసుకురావాలని అన్నారు. కరోనాను పూర్తిగా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
హెల్త్ ప్రొఫైల్తో ఎంతో మేలు..
ఎంపీ మాలోత్ కవిత
హెల్త్ ప్రొఫైల్తో ద్వారా ప్రజల సంపూర్ణ ఆరోగ్య వివరాలను వైద్యులతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశం ఉందని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడంలో భాగంగా సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు అధిక నిధులు కేటాయిస్తూ ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలో మానుకోట, ములుగు జిల్లాలో రెండు టీ డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఐటీడీఏ పీవో హన్మంత్ జెండగే, డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య పాల్గొన్నారు.