‘ఓటీటీలో విడుదలైన మా చిత్రానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. వినోదాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు ముఖ్యంగా మహిళలు అశ్లీలత లేకుండా ఆద్యంతం నవ్వులను పంచుతున్న మంచి సినిమా ఇదని చెబుతున్నారు’ అని అన్నారు మేర్లపాక గాంధీ. ఆయన కథను అందించిన తాజా చిత్రం ‘ఏక్మినీకథ’. సంతోష్శోభన్, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ రాపోలు దర్శకత్వం వహించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
నాన్న రచయిత కావడంతో మా ఇంటికి స్వాతి వార పత్రిక రెగ్యులర్గా వస్త్తుండేది. ఈ మ్యాగజైన్లో డాక్టర్ సమరం శీర్షికలో ఓ సమస్యను గురించిన ప్రశ్నలు ఎక్కువగా ఉండటం గమనించా. కాలం మారినా, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఆ అపోహలు మాత్రం ప్రజల్లో తొలగిపోలేదు. ఇప్పటికీ ఆ అనుమానంతో అనేక మంది ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. వెండితెరపై ఎవరూ స్పృశించని ఈ పాయింట్తో సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. దర్శకుడిగా వినోదమే నా బలం. అశ్లీలత తావు లేకుండా క్లీన్ కామెడీతో ఈ కథను సిద్ధం చేశా.
అసభ్యత విషయంలో హద్దులు ఎక్కడా దాటకుండా సినిమా చేశాం. ‘మాస్ట్రో’ సినిమాతో నేను బిజీగా ఉండటంతో నా శిష్యుడు కార్తిక్కు దర్శకత్వ బాధ్యతల్ని అప్పగించా. ఇలాంటి ఇతివృత్తంతో పేరున్న హీరోలు సినిమా చేయడానికి ఇష్టపడరు. అందుకే సంతోష్శోభన్ను కథానాయకుడిగా తీసుకున్నాం. కామెడీ టైమింగ్తో తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాడు. కథను నమ్మి ధైర్యంగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. థియేటర్లోనే ఈ సినిమాను విడుదలచేయాలనుకున్నాం. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. డ్రామా, థ్రిల్లర్స్తో పోలిస్తే ఓటీటీ వినోదాత్మక చిత్రాలకు అంతగా ఆదరణ ఉండదని నా నమ్మకం. కానీ నా అంచనాల్ని ఈ సినిమా చెరిపివేసింది. థియేటర్లో విడుదలకాలేదనే అసంతృప్తిని ఈ విజయం మరిపిస్తోంది.
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్స్ సంస్కృతి పెరిగింది. అందుకే భవిష్యత్తులో దర్శకుడిగా కొనసాగుతూనే ఓటీటీ సినిమాల కోసం కథలు రాయాలని అనుకుంటున్నా. నేను ఎంచుకునే ప్రతి కథ ఎైగ్జెట్మెంట్తో పాటు ఎక్కువకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటా. కథలు రాసే క్రమంలో ఎైగ్జెట్మెంట్ లోపించిన భావన కలిగితే కథల్ని పక్కనపెడుతుంటా. అందువల్లే దర్శకుడిగా నా సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తోంది. ప్రస్తుతం నితిన్తో రూపొందిస్తున్న ‘మాస్ట్రో’ డార్క్ హ్యుమర్తో విభిన్నంగా సాగుతుంది. బాలీవుడ్ చిత్రం ‘అంధాధూన్’కు రీమేక్ ఇది. మాతృక నాకు చాలా నచ్చింది. రీమేక్ చేసే అవకాశం వస్తే ఇలాంటి సినిమానే చేయాలనుకున్నా. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆసక్తికరంగా కథాగమనం ఉంటుంది. తెలుగు నేటివిటీకీ అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశాం. వారం రోజులు మినహా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది.