చీడపీడలు, కలుపు మొక్కల నివారణ
పంట దిగుబడి పెరిగే అవకాశం
అన్నదాతకు ప్రయోజనం
చందుర్తి, మే 7: వానకాలం, యాసంగి రెండు ఫసళ్లు సాగు చేసిన తర్వాత భూమిలో సారం తగ్గి, మరో పంటలో దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు రైతులు వానకాలం పంట వేసే ముందు వేసవిలో దుక్కులు దున్నుకుంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. వేసవి దుక్కుల వల్ల కలుపుమొక్కల సమస్య ఉండదు. ఏప్రిల్, మేలో కాసే ఎండల తీవ్రతకు నేలలోని చీడపీడల గుడ్లు, లార్వాలు, శిలీంధ్రాలు చనిపోయి, పంటలనాశించే తెగుళ్లు, చీడపురుగుల బెడద తగ్గుతుంది. రుతుపవనాలు ప్రారంభమై తొలకరి వర్షాలు పడగానే విత్తనాలు నాటుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. భూమి పూర్తి స్థాయిలో గుల్లబారి, తేమశాతం పెరిగి, విత్తనాలు పూర్తి స్థాయిలో మొలకెత్తుతాయి. పైరు కూడా వర్షాభావ పరిస్థితులను కొంత వరకు తట్టుకొని, అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
చీడపురుగుల బెడద అరికట్టవచ్చు
వేసవి దుక్కులతో చీడపురుగుల బెడద తగ్గుతుంది. వానకాలం సీజన్ పంటలపై ఆశించి, నష్టాన్ని కలిగించే గొంగళిపురుగులు, లద్దె పురుగు, పచ్చపురుగు లాంటి చీడపురుగుల వాటి జీవితచక్రం దశ పూర్తికాగానే అవి భూమి లోపలికి వెళ్లి సుప్తావస్థలో ఉంటాయి. వేసవి పూర్తయి, వర్షాలు పడగానే తిరిగి రెక్కలపురుగుల రూపంలో బయటకు వచ్చి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వేసవి దుక్కులు దున్నడంతో భూమిలో సుప్తావస్థలో ఉండే పురుగులు బయటపడగానే పక్షులు, కీటకాలు తింటాయి. కొన్ని ఎండ తీవ్రతకు మరణిస్తాయి. పంటలకు తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు సైతం నశిస్తాయి. చీడపురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గి, పెట్టుబడులు కూడా తగ్గుతాయి. అందుకే రైతులు పూర్వకాలం నుంచి వేసవి దుక్కులు దున్నడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జూన్, జూలై మాసాల్లో విత్తుకునే పంటల కోసం కొన్ని ప్రాంతాల్లో ఉగాది పర్వదినం రోజే వేసవి దుక్కులు దున్నేందుకు ముహూర్తం పెడుతుంటారు. ఇలా ఉగాదిరోజే పూజలు చేసి, వానకాలం సాగు పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇలాంటి ఆచారాన్ని పాటిస్తూ అన్నదాతలు ప్రణాళిక ప్రకారం పంటల సాగు చేస్తున్నారు. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి, అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కాగా, మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వేసవి దుక్కులు దున్నడం ప్రారంభించారు.
పెరుగనున్న తేమశాతం
వేసవి దుక్కులు ట్రాక్టర్, యంత్రం లేదా ఎద్దుల సహాయంతో లోతుగా దున్నడం వల్ల నేలలో తేమశాతం పెరుగుతుంది. తేమ నిల్వ ఉండడంతో నేలలోని కలుపుమొక్కల ఉధృతి తగ్గుతుంది. విత్తనం వేయగానే పూర్తి స్థాయిలో మొలకెత్తుతుంది. వర్షాభావ పరిస్థితులను సైతం పంటలు తట్టుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు పంటలకు సక్రమంగా అంది, అధిక దిగుబడి సాధించేందుకు వీలవుతుంది.
ఏటా వేసవిలో దుక్కి దున్నుతా
ఏటా యాసంగి పంట పూర్తి కాగానే ఇరువళ్లు (రెండు సాల్లు) నేలను దుక్కి దున్నడంతో వానకాలం పంట వేసే వరకు భూమి మంచిగా పొతం అయితది. ఎండలకు భూమిలోని పురుగులు, చీడలు, కలుపుమొక్కలు చనిపోతాయి. వర్షాలు పడగానే మరో సాలు దున్ని విత్తనాలు వేసుకుంటాం. కలుపుమొక్కలు, చీడపీడల ఉధృతి తగ్గి, పంట దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. పంట పెట్టుబడి చాలా వరకు తగ్గుతుంది.