న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1027 మందిని పొట్టనబెట్టుకుంది. గత ఆరు నెలల్లో 24 గంటల్లో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. ఇక కేసుల సంఖ్యలో కొత్త రికార్డు నమోదైంది. 24 గంటల్లో ఏకంగా 1,84,372 కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యులు పెట్టినా ఫలితం లేకుండా పోతోంది.
ఇక 24 గంటల్లో 82,339 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 1,38,73,825కు చేరుకోగా.. కోలుకున్న వాళ్లు 1,23,36,036గా ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,65,704 ఉన్నాయి.
వరుసగా నాలుగో రోజూ ఇండియాలో లక్షన్నరకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికా తర్వాత ఒకే రోజులో ఇన్ని కేసులు వచ్చిన దేశం కూడా ఇండియానే. కరోనా సెకండ్ వేవ్కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కేసులు ఆందోళకర స్థాయిలో పెరిగిపోతుండటంతో ఇప్పటికే వివిధ దేశాల్లో అనుమతి పొందిన విదేశీ టీకాల వినియోగానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.