ఇక గ్రామసభ ఆమోదం మేరకు నిధుల ఖర్చు
జీవో 91తో వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న పంచాయతీ పాలకవర్గాలు
ఇల్లెందు రూరల్, మే 6: గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి కేంద్ర ఆర్థిక సంఘంతోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజరవుతుంటాయి. జనాభా ప్రాతిపదికన ప్రతి మూడు నెలలకోసారి నిధులు నేరుగా గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ అవుతుంటాయి. ఇవి కాకుండా గ్రామ పంచాయతీలకు వివిధ రకాల పన్నుల రూపంలో ఏటా కొంత మొత్తంలో నిధులు సమకూరుతుంటాయి.
గతంలో నిధుల ఖర్చు ఇలా..
ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు మంజూరయ్యే నిధులు ఖర్చు చేయాలంటే ముందస్తు ప్రణాళిక తప్పనిసరి. పల్లెల్లో అత్యవసరంగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తే వార్షిక ప్రణాళికకు లోబడి ఉన్నతాధికారుల నుంచి పరిపాలనపరమైన ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపు కోసం ముందుగానే ప్రాధాన్య క్రమంలో పనులు గుర్తించేవారు. వాటి అనుమతుల కోసం ఎంపీవో, డీపీవో, కలెక్టర్లకు నివేదికలు పంపించేవారు. రూ.లక్ష వరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, రూ.2 లక్షల వరకు ఎంపీవో, రూ.3 లక్షల వరకు డీపీవో, రూ.5 లక్షలు ఆపైన కలెక్టర్ పరిపాలన పరమైన ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇలా వీరి నుంచి ఆమోదం పొందిన తరువాతే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు నిధులు ఖర్చు చేసేందుకు వీలు ఏర్పడుతుంది.
తాజా జీవోతో నిధుల ఖర్చు ఇలా..
పల్లెల్లో అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టేలా జీవో 91 పంచాయతీల పాలరవర్గాలకు అవకాశం కల్పిస్తోంది. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం ఉన్నతాధికారుల ఆమోదం అవసరం లేకుండానే నిల్వ ఉన్న నిధులను నిబంధనలకు లోబడి గ్రామసభ ఆమోదంతో పాలకవర్గామే పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేయొచ్చు. అయితే పనులు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నిబంధనలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
పంచాయతీ పాలకవర్గాల హర్షం
గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంలో స్వేచ్ఛనిస్తూ ప్రభుత్వం నూతనంగా జీవో నెంబర్ 91 జారీ చేయడం పట్ల పంచాయతీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాజా జీవోతో పల్లెల్లో ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం పాలకవర్గాలకు కల్పించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అనేక ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంతర్గత రహదారుల మరమ్మతుల పనులు, మురుగు కాల్వల నిర్మాణం, కల్వర్టులు, పైపులైన్లకు మరమ్మతు పనులను గ్రామసభ ఆమోదంతో సత్వరమే చేపట్టే వెసులుబాటు కలిగిందని ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జీవోతో సత్వర పరిష్కారం
గ్రామ పంచాయతీల్లో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు అధికారుల అనుమతి మంజూరులో జాప్యం ఏర్పడేది. కానీ ప్రభుత్వం నూతనంగా జారీ చేసి జీవో 91తో అందుబాటులో ఉన్న నిధులను ఇంజినీరింగ్ విభాగం నిబంధనల మేరకు గ్రామసభ ఆమోదంతో ఖర్చు చేసుకొని సమస్యలను సత్వరమే పరిష్కరించుకునే అవకాశం ఏర్పడుతోంది.
-వల్లాల మంగమ్మ, సర్పంచ్, సుభాష్నగర్, ఇల్లెందు