న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేర్కొంది. బుధవారం నుంచి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా వాట్సాప్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వార్తాకథనాలు వచ్చాయి.
కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం అడిగినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులకు మూలాలను తెలియజేయాల్సి వస్తున్నది. ప్రత్యేకించి దేశ సార్వభౌమత్వం, రక్షణ తదితర కీలకాంశాల సమాచారం గానీ, ప్రజల భద్రతకు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సదరు సోషల్మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాలి.
ఇది భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించడమేనని వాట్సాప్ ఆరోపిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఉంటాయని, ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్క్రిప్షన్ను పక్కన పెట్టాల్సి వస్తుందని వాట్సాప్ వాదన.
అందువల్ల ఈ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ పిటిషన్ దాఖలు చేసిందని వినికిడి. అయితే ఈ పిటిషన్ను వాట్సాప్ స్వయంగా దాఖలు చేసిందా? లేదా? ఇంకా దీనిపై కోర్టు ఎప్పుడు విచారణ జరపనుందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉండగా.. కొత్త కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల అమలుకు చర్యలు చేపడతామని వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్బుక్ చెప్పడం గమనార్హం. వాస్తవంగా డిజిటల్ కంటెంట్పై నియంత్రణకు కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ లాంటి దిగ్గజ సోషల్ మీడియా సంస్థలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల గడువు కల్పించింది. అది మంగళవారంతో ముగిసింది. అంటే.. బుధవారం నుంచి కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లైంది.
ఈ రూల్స్కు సోషల్ మీడియా వేదికలన్నీ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఇన్నాళ్లూ వాటికి రక్షణగా నిలుస్తున్న మధ్యవర్తి హోదా రద్దవుతుంది. అప్పుడు ఆయా సంస్థలు క్రిమినల్ కేసులు, ఇతర చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.