జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
విశిష్ట సేవలందించిన ప్రముఖ మహిళలకు సన్మానం
శంషాబాద్, మార్చి 19: మహిళాసాధికారతకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎంఆర్ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించారు. ఈ సందర్భం గా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ..అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇంటికి దీపం ఇల్లాలని, ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలోఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూడాలని కోరారు.
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ మగవారితో సమానంగా సేవా కార్యక్రమాలు, రాజకీయ, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని అన్నారు. ప్రభుత్వం మహిళలకు రాజకీయ, ఆర్థిక సాధికారతకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు మరింత పురోగమించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీపీ దుద్ద్యాల జయమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ ఎంపీపీ నీలం నాయక్, ఎంపీడీఓ వినయ్కుమార్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ డీ వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, నీరటి రాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.