న్యూఢిల్లీ: భుజం గాయం కారణంతో ఇంగ్లాండ్తో మిగతా రెండు వన్డేలకు దూరమైన భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది. కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరమవుతున్నందున శ్రేయస్ ట్విటర్లో స్పందించాడు. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని, వేగంగా పునరాగమనం చేయాలని బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది.
‘నేను మీ సందేశాలను చదువుతున్నాను. మీ ప్రేమ, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎదురుదెబ్బ ఎంత గట్టిగా తగిలినా..అంతే వేగంతో బలంగా పుంజుకుంటాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను’ అంటూ అయ్యర్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మైదానంలో గాయపడినప్పుడు విలవిల్లాడిన ఫొటోలను షేర్ చేశాడు. అయ్యర్ కోలుకోవడానికి 4-5 నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.