‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్లో అగ్ర కథానాయిక సమంత పోషించిన తమిళ పోరాటయోధురాలు రాజీ పాత్రకు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. శ్రీలంకలోని తమిళుల స్వతంత్య్రం కోసం పోరాడే ఆత్మాహుతిదళ సభ్యురాలిగా ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగువారైన రాజ్-డీకే ద్వయం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. రాజీ పాత్ర తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ పాత్రకు న్యాయం చేయడానికి ఎంతో శ్రమించానని సమంత తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘అణచివేత, దురభిమానం, అత్యాశలపై మానవులు చేసిన పోరాటానికి ప్రతీకలా రాజీ పాత్రను అభివర్ణించవొచ్చు. షూటింగ్కు ముందు శ్రీలంక తమిళుల పోరాటానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చూశాను. దశాబ్దాల పాటు స్వాతంత్య్రం కోసం వారు చేసిన పోరాటం, చేసిన త్యాగాలు చూసి హృదయం ద్రవించింది. ఈ పౌర యుద్ధంలో వేలమంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలు జీవనాన్ని కోల్పోయారు. ఆ యుద్ధం తాలూకు గాయాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. యుద్ధంలో అమరులైన వారికి రాజీ కథ ఓ నివాళి. అణచివేతకు వ్యతిరేకంగా స్వేచ్ఛను కోరుకునే వారందరికి రాజీ స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని సమంత పేర్కొంది.