బడుల మరమ్మతుకు రూ. 78.56 లక్షలు విడుదల
మారనున్న పాఠశాలల రూపురేఖలు
ఇప్పటికే ఎస్ఎంసీ ఖాతాల్లో జమ
మే లోగా పూర్తి చేసేందుకు చర్యలు
జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 405 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 291, ప్రాథమికోన్నత 45, ఉన్నత పాఠశాలలు 69 ఉన్నాయి. సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఇప్పటికే పాఠశాలల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. జిల్లాకు మంజూరైన నిధుల్లో ఎస్సీ కేటగిరీ కింద 24 శాతం, ఎస్టీలకు 14 శాతం, జనరల్ కేటగిరీ కింద 62 శాతం చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులను విద్యుత్, తాగునీరు, తరగతి గదుల మరమ్మతులు, స్టేషనరీ, గ్రంథాలయాలు, ప్రయోగశాలల నిర్వహణకు అధికారులు వినియోగించనున్నారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలోని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలన్నీ తీరుతాయని అధికారులు తెలిపారు.
కొత్త ఎమ్మార్సీలకు…
జిల్లాలోని టేకుమట్ల, పలిమెల మండలాల్లో కొత్తగా నిర్మించిన ఎమ్మార్సీ భవనాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఒక్కొక ఎమ్మార్సీకి రూ. 2.40 లక్షల చొప్పున రెండు ఎమ్మార్సీలకు గాను రూ.4.80 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, టేబుళ్లు, సమావేశాల కోసం కుర్చీలు, తదితర సామగ్రిని అధికారులు కొనుగోలు చేయనున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు..
మే నెల చివరి వరకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తాం. పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం జిల్లాకు రూ.78,56,250 కేటాయించింది. వీటిని నేరుగా పాఠశాలల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఖర్చు చేస్తాం.