అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘అల వైకుంఠపురములో’ గత ఏడాది తెలుగు చిత్రసీమలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్నది. ఇందులో కార్తిక్ అర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ కథానాయిక మనీషా కొయిరాలా కీలక పాత్రలో నటించనుంది. తెలుగు వెర్షన్లో టబు పోషించిన తల్లి పాత్రలో మనీషా కొయిరాలా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. కథ, పాత్రచిత్రణ నచ్చడంతో ఆమె ఈ రీమేక్లో నటించడానికి అంగీకరించినట్లు చిత్రబృందం చెప్పింది. కృతిసనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు.