విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం తొలిసారి చారిత్రక కథాంశంతో రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయంరవి, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అల్లిరాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని 2022లో విడుదలచేయబోతున్నట్లు సోమవారం చిత్రబృందం ప్రకటించింది. కత్తి, సింహం బొమ్మతో కూడిన డాలును చూపిస్తూ కొత్త పోస్టర్ను విడుదలచేశారు. ‘ఓ స్వర్ణయుగం తిరిగి జీవం పోసుకోనుంది’ అంటూ పోస్టర్ను ఉద్దేశిస్తూ చిత్రబృందం వ్యాఖ్యానించింది. తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా చోళ రాజు రాజరాజ-1 జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పునఃప్రారంభమైంది. పాండిచ్చేరిలో షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.రవివర్మన్, సంగీతం: ఏ.ఆర్ రెహమాన్.