మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తెరకెక్కించే మణిరత్నం ప్రస్తుతం భారీ తారాగణంతో పీరియాడికల్ మూవీ ”పొన్నియన్ సెల్వన్ చేస్తున్నాడు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందుతుతున్న ఈ సినిమాలో విక్రమ్,కార్తీ ,జయం రవి, విక్రమ్ ప్రభు,ఐశ్వర్యారాయ్ ,త్రిష ,శోభితా ధూళిపాళ్ల ,ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కరోనా వలన ఈ చిత్ర షూటింగ్ కూడా వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ చిత్ర మెజారిటీ భాగం చెన్నై, హైదరాబాద్,రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. రీసెంట్గా పుదుచ్చేరిలో కీలకమైన షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు.ఇప్పుడు హైదరాబాద్లో కీలకమైన షూటింగ్ జరిపేందుకు మణిరత్నం ప్లాన్ చేశాడు. రామోజీ ఫిలిం సిటీలోని గ్రేప్ గార్డెన్ రోడ్ లో కార్తి , త్రిష , శోభిత దూళిపాళ్లపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను రెండు వందలమంది డ్యాన్సర్లపై తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
రెండు భాగాలుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుండగా, ఇటీవల రిలీజ్ చేసిన ‘పీఎస్-1’ లోగో పోస్టర్ ఆకట్టుకుంది. లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ‘నవాబ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మణిరత్నం రూపొందిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. మరోవైపు ‘నవరస’ అనే ఆంతాలజీ సిరీస్ ను రూపొందించారు లెజండరీ దర్శకుడు.