గువాహటి, మే 9: తేయాకు రాష్ట్రం అస్సాం తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్ఈడీఏ) కన్వీనర్, ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి హిమంత బిశ్వశర్మను సీఎం అభ్యర్థిగా బీజేపీ, ఎన్డీఏ శాసనసభాపక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆదివారం వెల్లడించారు. దీంతో బిశ్వశర్మ అస్సాం తదుపరి సీఎంగా సోమవారం ప్రమాణం చేయనున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ అధిష్ఠానం పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. తదుపరి సీఎంగా బిశ్వశర్మను.. ప్రస్తుత సీఎం శర్బానంద సోనోవాల్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్ కుమార్ దాస్ ప్రతిపాదించారు. మరో వ్యక్తి పేరు చర్చకు రాకపోవడంతో సీఎంగా బిశ్వశర్మను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. కాగా తదుపరి సీఎం పదవి కోసం ప్రస్తుత సీఎం శర్బానంద కూడా పట్టుబట్టినట్టు తొలుత వార్తలు వచ్చాయి. 2001లో రాజకీయరంగ ప్రవేశం చేసిన బిశ్వశర్మ ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతిసారీ గెలిచి, ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు.