న్యూఢిల్లీ: ఇండియన్ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) నుంచి వేతనాలు పెరగనున్నాయి. వచ్చేనెల నుంచి వేతనాల పెంపు అమలులోకి వస్తుందని టీసీఎస్ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు. సంస్థలో పని చేస్తున్న 4.69 లక్షల పై చిలుకు మంది నిపుణులు, ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఐటీ మేజర్ గత ఆరు నెలల్లో వేతనాలు పెంచడం ఇది రెండోసారి.
గతేడాది అక్టోబర్లో టీసీఎస్ తమ సిబ్బందికి 6-8 శాతం వేతనాలు పెంచింది. తాజాగా టీసీఎస్ తీసుకున్న నిర్ణయంతో టీసీఎస్ సిబ్బందికి సగటున 12-14 శాతం వేతనం పెరుగనున్నది. ఆరు నెలల్లో రెండోసారి వేతనాలు పెంచినందుకు టీసీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరో ఐటీ దిగ్గజం యాక్సెంచర్ గురువారం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.