ధూళిమిట్ట, మే 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ఆరోగ్య సర్వే మండల కేంద్రంతో పాటు కూటిగల్ గ్రామంలో శుక్రవారం ఆయా గ్రామాల సర్పంచ్ దీపిక వేణుగోపాల్రెడ్డి, బాలమణి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు అనిత, రాజ్కుమార్, ఉపసర్పంచ్ పోతరాజు మధు, చెప్యాల రేణుక, ఏఎన్ఎంలు ఉన్నారు.
కరోనా రోగులకు ఉచిత ఆహారం
కరోనా రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మానవత్వంతో ఆదుకునేందుకు దుబ్బాక మెడికల్ షాపుల యజమానులు ముందుకు వచ్చారు. పట్టణ పరిధిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి అండగా ఉండేందుకు ఉదయం అల్పాహారంతో పాటు రెండు పూటల భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కరోనా బారిన పడిన కుటుంబం యజమాని పేరును ఒక రోజు ముందుగా పట్టణంలోని ఏదైనా మెడికల్ షాపులో నమోదు చేసుకుంటే భోజనాన్ని ఇంటి వద్దకు తీసుకువెళ్తున్నామని సంఘం అధ్యక్షుడు వడ్లకొండ శ్రీధర్ తెలిపారు. మొదటి రోజు శుక్రవారం 20 మంది కరోనా బాధితులకు అల్పాహారం, భోజనాన్ని అందజేశామన్నారు. దుబ్బాక పట్టణ పరిధిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి మాత్రమే ఈ సదుపాయాన్ని కలుగజేస్తున్నామన్నారు. వీరితో పాటు పట్టణంలోని సత్య టిఫిన్ సెంటర్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు టిఫిన్ సెంటర్ యజమాని మర్గల సత్యానందం ఉచితంగా టిఫిన్ను అందజేశారు.
వైరస్ పట్ల భయం వద్దు
కరోనా వైరస్ పట్ల ప్రజలు భయపడవద్దని ఎంపీపీ కొక్కుల కీర్తి అన్నారు. శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వరం సర్వేను పలు గ్రామాల్లో ప్రారంభించి మాట్లాడారు ఎంపీడీవో శ్రీధర్, పీహెచ్సీ డాక్టర్ విజయారావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వంగపల్లిలో ఏఎన్ఎం, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లతో కలిసి ఇంటింటా సర్వేలో సర్పంచ్ గంగి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం చేపట్టిన ఇంటింటా సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.
అనారోగ్య లక్షణాలను దాచిపెట్టొద్దు
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య (జ్వర) సర్వేకు ప్రజలు సహకరించాలని ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ కోరారు. శుక్రవారం మండలంలోని నాగపురి, పెదరాజుపేట, కడవేర్గు గ్రామాల్లో ఎంపీపీ పర్యటించి సర్వే బృందాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య లక్షణాలు, ముఖ్యంగా జ్వరం వస్తే వివరాలు వెల్లడించాలన్నారు. కరోనాను జయించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు బండకింది సంతోషి సంతోషికరుణాకర్, నూనె వెంకట్, కొమ్ముల స్వప్నస్వామి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎం, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేసీ సీఏలు పాల్గొన్నారు.
కడవేర్గు గ్రామంలో ..
మండలంలోని కడవేర్గు గ్రామంలో సర్పంచ్ కొమ్ముల స్వప్నస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పంచాయతీ సి బ్బంది పిచికారీ చేశారు. కొవిడ్ లక్షణాలు ఉంటే వైద్య బృందాలకు వివరాలు తెలియజేయాలన్నారు.
అధైర్యపడొద్దు.. ఆరోగ్యమే ముఖ్యం
జెబ్బాపూర్ గ్రామంలో శుక్రవారం ఏఎన్ఎం శ్రీలత ఆధ్వర్యంలో ఇంటిం టా ఆరోగ్య సర్వే నిర్వహించారు. కరోనా తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆశవర్కర్ మౌనిక, అంగన్వాడీ టీచర్ స్వరూప, పంచాయితీ కార్యదర్శి కల్పన పాల్గొన్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
మండలంలోని గట్లమల్యాలలో సర్పంచ్ తిప్పని రమేశ్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుందని ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. వార్డు సభ్యులు రంగు వెంకన్న, ప్రవీణ్కుమార్, సతీశ్, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా..
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో జ్వర సర్వేను ఆరోగ్య కార్యకర్తలు ప్రారంభించారు. శ్రీగిరిపల్లి పీహెచ్సీ పరిధిలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు శ్రీగిరిపల్లి, అక్కారం, కోనాపూర్, దాతర్పల్లి గ్రామాల్లో మొత్తం 30 సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన సర్వేను మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పరిశీలించారు. ఆరోగ్య కార్యకర్తలకు ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను వివరించి సహకరించాలన్నారు.