లండన్ : కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారుచేసిన జర్మన్ శాస్త్రవేత్త దంపతులు.. క్యాన్సర్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ తయారీపై దృష్టిసారించారు.
కణితులను ఎదుర్కోవటానికి శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి బయోఎంటెక్ సీఈవో డాక్టర్ ఉగర్ సాహిన్, అతని భార్య డాక్టర్ ఓజ్లెం తురేసి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఇప్పుడు ఈ జంట క్యాన్సర్ టీకా తయారీలో బిజీగా ఉన్నారు.
అంతా సవ్యంగా జరిగితే.. రాబోయే రెండేండ్లలో క్యాన్సర్ వ్యాధి నివారణకు కూడా వ్యాక్సిన్ను కూడా అందిస్తామని వీరు చెప్తున్నారు. ఈ జంట గత 20 సంవత్సరాలుగా క్యాన్సర్ చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్నది.
చైనాలో ప్రజలకు గుర్తుతెలియని వైరస్ సోకినట్లు గత సంవత్సరం తెలుసుకున్నప్పుడు.. కణితులను పరిష్కరించడానికి శరీర రోగనిరోధక శక్తిని ఉపయోగించుకునే మార్గంలో వీరు అప్పటి నుంచి పనిచేస్తున్నారు.
విస్తృతంగా ఉపయోగిస్తున్న మొట్టమొదటి కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందించిన సంస్థగా వీరు చరిత్రకెక్కారు. ఫైజర్ సంస్థతో కలిసి బయోఎన్టెక్ సంస్థ సిద్ధం చేసిన కరోనా వ్యాక్సిన్ 90 శాతం ఫలితాన్ని ఇస్తున్నట్లుగా తేలడంతో అటు బ్రిటన్తో పాటు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ తయారుచేసే సమయంలో అదే ప్రాతిపదికన క్యాన్సర్ వ్యాధిని కూడా పూర్తిగా తొలగించడానికి మేము కొన్ని టీకాలను సిద్ధం చేసామని డాక్టర్ తురేసి చెప్పారు. క్యాన్సర్ వ్యాక్సిన్లను త్వరలో క్లినికల్ ట్రయల్ చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎం-ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లు క్యాన్సర్ను పడగొట్టడానికి ముందే శరీరానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని ఇస్తాయని ఇప్పటివరకు చేసిన పరిశోధనలు రుజువు చేస్తున్నాయని డాక్టర్ తురేసి తెలిపారు.
అంటే, క్యాన్సర్ రోగులు ఇప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల భరించలేని నొప్పి నుంచి బయటపడనున్నారు. దీంతోపాటు జుట్టు రాలడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.
ఇప్పుడు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు కూడా ఎం-ఆర్ఎన్ఏ తయారీలో పాలుపంచుకున్నారు.
ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సారా గిల్బర్ట్, ప్రొఫెసర్ అడ్రియన్ హిల్.. క్యాన్సర్ చికిత్సలో ఎం-ఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో సహకరిస్తున్నారు.
వేసవిలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న రోగులపై ఎం-ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ల పరీక్షకు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. ప్రోస్టేట్ క్యాన్సర్కు సమర్థవంతమైన వ్యాక్సిన్ చికిత్స కోసం ఇప్పటికే పనిచేస్తున్న ‘వాసిటెక్’ అనే సంస్థను స్థాపించారు. ప్రారంభ పరీక్షలు ఈ టీకా నుంచి చాలా సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
డాక్టర్ ఉగర్ సాహిన్, డాక్టర్ తురేసి జంట అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జర్మనీ దేశం తమ దేశ అత్యున్నత పురస్కారం.. ఆర్డర్ ఆఫ్ మెరిట్ను అందించి సత్కరించనున్నది.
శుక్రవారం జరిగే ఒక కార్యక్రమంలో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్మీర్ నుంచి వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా హాజరుకానున్నారు.
పరంబీర్ పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.