సీనియర్ హాస్యనటుడు పొట్టి వీరయ్య(74) గుండెపోటుతో ఆదివారం హైదరాబాద్లో కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి గ్రామంలో జన్మించిన వీరయ్య తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఐదొందలకుపైగా సినిమాల్లో నటించారు. మరుగుజ్జు పాత్రలతో మెప్పించారు. నాటకాల ద్వారా సినిమాలపై ఆసక్తి ఏర్పడటంతో అవకాశాల కోసం మద్రాస్కు పయనమయ్యారు. విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘అగ్గిదొర’ చిత్రంతో వీరయ్య సినీరంగప్రవేశంచేశారు. ఈ సినిమాలో పోషించిన ‘దొడ్డ దొర’ పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మహాబలుడు, జగన్మోహిని, రాజసింహా, అగ్గివీరుడు,
గండరగండడుతో పాటు పలు జానపద చిత్రాల్లో హాస్యనటుడిగా కనిపించారు. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు రూపొందించిన ‘తాతా మనవడు’లో చిన్న పాత్రను పోషించారు వీరయ్య. ‘రాధమ్మపెళ్లి’ సినిమాలో వీరయ్య కోసమే ట్రాన్స్జెండర్ పాత్రను దాసరి సృష్టించారు. సాంఘిక చిత్రాల్లో సంసారం సాగరం, గజదొంగ, యమదొంగ, కొండవీటిరాజా, నేరం నాది కాదు ఆకలిది, పిల్లా పిడుగా, వదినగారి గాజులుతో పాటు పలు విజయవంతమైన చిత్రాల్లో వీరయ్య నటించారు. తమిళంలో రజనీకాంత్తో కలిసి ‘అచ్చమిళై అచ్చమిళై’ సినిమా చేశారు. ఎన్టీఆర్, కాంతారావు కృష్ణ, సావిత్రి, ఎమ్జీఆర్, శివాజీగణేషన్, రజనీకాంత్తో పాటు దక్షిణాది చిత్రసీమలోని అగ్రనటీనటులందరితో సినిమాలు చేశారాయన. 1974లో మల్లికను ప్రేమవివాహం చేసుకున్నారు వీరయ్య. 2008లో ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సినిమా అవకాశాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చిత్రపురి కాలనీలో సొంతింటిని మంజూరు చేసింది. వీరయ్య మృతిపట్ల చిరంజీవి, జీవితా రాజశేఖర్తో పాటు పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీ హాస్యనటుడు పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుంచి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన గట్టు వీరయ్య సినీ ప్రేక్షకులను తన విలక్షణ నటనతో అమితంగా అలరించారని సీఎం గుర్తుచేసుకున్నారు. వీరయ్య కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.