యూకే, ఇజ్రాయెల్, అమెరికాలే నిదర్శనం
6 దేశాల్లో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి
మన దేశంలోనూ సత్ఫలితాలిస్తున్న వ్యాక్సిన్
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కరోనాపై టీకా రామబాణంగా పనిచేస్తున్నది. యూకే, ఇజ్రాయెల్, అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. యూకేలో రోజువారీ కేసులు 70 వేలనుంచి 2 వేలకు పడిపోగా, అమెరికాలో 80 శాతం కేసులు తగ్గాయి. ఇజ్రాయెల్ ఏకంగా మాస్కుల నిబంధననే ఎత్తివేసింది. ఈ దేశాల్లో పరిస్థితులు గతేడాదికన్నా భిన్నంగా ఉండటానికి కారణం వ్యాక్సినేషనే అంటున్నారు వైద్యనిపుణులు. సాధ్యమైనంత ఎక్కువ జనాభాకు టీకా వేయడంవల్ల వైరస్ ఉద్ధృతిని నిరోధించవచ్చని చెప్తున్నారు.
యూకేలో 97% తగ్గిన కేసులు
బ్రిటన్లో గత ఏడాది డిసెంబర్ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడు రోజుకు 60- 70 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. దాదాపు 1,200 మంది చనిపోయేవారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకున్నకొద్దీ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ రోజుకు వెయ్యి నుంచి 2 వేల కేసులు మాత్రమే వస్తుండగా, చనిపోతున్నవారి సంఖ్య రోజుకు 15-20 మాత్రమే ఉన్నది. దాదాపు 97 శాతం కేసులు తగ్గిపోయాయి.
ఇజ్రాయెల్లో 61% జనాభాకు టీకా
ఇజ్రాయెల్లో ప్రస్తుతం మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేశారు. స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. పర్యాటకుల రాక ప్రారంభమైంది. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు కరోనాను జయించిందని చెప్పవచ్చు. దీనికి కారణం ఈ దేశంలో 61% మందికి టీకా వేయడమే.
అమెరికాలో 80% తగ్గిన కేసులు
ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులు గత ఏడాది సెప్టెంబర్- జనవరి మధ్య అమెరికాలో ఉండేవి. రోజుకు లక్ష నుంచి 3.07 లక్షల కేసులు వెలుగుచూసేవి. అదే సమయంలో అక్కడ అధ్యక్ష ఎన్నికలు కూడా జరిగాయి. రోజుకు 2 వేల నుంచి 6 వేల మంది చనిపోయేవారు. ప్రస్తుతం 39.56% మందికి టీకా వేయగా, రోజువారీ కేసుల సంఖ్యలో 80% తగ్గుదల కనిపిస్తున్నది. రోజుకు 50 వేల నుంచి 60 వేలు మాత్రమే నమోదవుతున్నాయి.
స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లోనూ మెరుగు
స్పెయిన్లో జనవరి వరకు రోజుకు 25- 30 వేల కేసులు వెలుగుచూడగా, ఇప్పుడు 8-10 వేలు మాత్రమే నమోదవుతున్నాయి. 20% వ్యాక్సినేషన్ జరిగింది. ఫ్రాన్స్లో ఇప్పటివరకు 18.73% మందికి టీకా వేశారు. ఈ నెల మొదట్లో ఇక్కడ రోజుకు 60 వేల వరకు కేసులు నమోదు కాగా, ఇప్పుడు 30 వేల కేసులు రికార్డవుతున్నాయి. జర్మనీలో 20.07% మందికి టీకా వేశారు. ఇప్పుడు ఇక్కడ 400లోపే మరణాలు నమోదవుతున్నాయి.
భారత్లోనూ ఫలితమిస్తున్న టీకా
మనదేశంలో ప్రస్తుతం రెండు రకాల టీకాలు ఇస్తున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్. ఇప్పటివరకు 11.6 కోట్ల మందికి కొవిషీల్డ్ వేశారు. ఇందులో మొదటి డోస్ వేసిన అనంతరం 17,145 మందికి వైరస్ సోకగా, రెండుడోసులు తీసుకున్న తరువాత 5,014 మందికి మాత్రమే వైరస్ సోకింది. కొవాగ్జిన్ మొత్తం 1.11 కోట్ల మందికి ఇవ్వగా, మొదటి డోస్ ఇచ్చినవారిలో 4,208 మందికి పాజిటివ్ రాగా, రెండు డోసులు తీసుకున్నవారిలో 695 మందికి మాత్రమే సోకింది.
ఈ నెల 22 వరకు దేశాలవారీగా టీకా వేసుకున్న జనాభా (శాతం)
ఇజ్రాయెల్ 61
బ్రిటన్ 48.66
చిలీ 40.69
అమెరికా 39.56
బహరీన్ 36.02
హంగేరీ 34.34
ఉరుగ్వే 30.86
కెనడా 24.67
స్పెయిన్ 20.19
జర్మనీ 20.07
ఫ్రాన్స్ 18.73
టర్కీ 14.54
బ్రెజిల్ 11.95
ఇండియా 9.51