చార్మినార్ : కిడ్నాప్ కథ సుఖాంతమైంది.. ఈ నెల 14న చార్మినార్ వద్ద కిడ్నాప్ అయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు.. చాకెట్లు, ఐస్ క్రీం ఇప్పిస్తానంటూ నమ్మించి పిల్లలను ఎత్తుకెళ్లి.. వారితో భిక్షాటన చేయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు పోలీసులు దాదాపు 200 సీసీ కెమెరాలు జల్లెడపట్టి చిన్నారుల ఆచూకీని కనిపెట్టారు. సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపా ల్ వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గంగమ్మ.. తన కూతురు నీలకాంతం కుమారులు, కూతురిని తీసుకుని నగరానికి వచ్చింది. గంగమ్మ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది.
ఈ క్రమంలో ఈ నెల 14న గంగమ్మ తన మనుమళ్లు శంకర్ అలియాస్ శంకరయ్య (7), శివప్రసాద్ (4), మనెమ్మ (9)తో చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయ ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ చిన్నారులను ఉంచి.. మంగమ్మ సమీపంలోని శివాలయంలోకి వెళ్లింది. అదే సమయంలో శంకరయ్య కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని మూత్రశాలకు వెళ్లాడు. అప్పుడే కర్మన్ఘాట్ ప్రాంతానికి చెందిన మల్లమ్మ అక్కడకు వచ్చింది.. శివప్రసాద్, మనెమ్మలు ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి.. చాక్లెట్లు, ఐస్ క్రీంలు కొనిస్తానంటూ తీసుకెళ్లింది. బస్సులో కోఠికి చేరుకుని..అక్కడి నుంచి ఆటోలో కర్మన్ఘాట్కు చేరుకుంది. అయితే.. గంగమ్మ తిరిగి వచ్చేసరికి చిన్నారులు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది.