నాసాతో కలిసి హెచ్సీయూ పరిశోధన
కొత్తగా నాలుగు బ్యాక్టీరియాల గుర్తింపు
మూడింటికి శాస్త్రవేత్త అజ్మల్ఖాన్ పేరు
తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు.. అనేది భర్తృహరి సుభాషితం! కష్టపడితే ఏదైనా సాధించవచ్చనేది దాని సారాంశం! అదే దారిలో నాసా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధనలు సాగుతు న్నాయి. ఒక్క భూమిపైనే జీవజాలం మనుగడకు అవకాశం ఉన్నదనేది ఇంత వరకు మనకు తెలిసిన సత్యం. కానీ.. కొంత కష్టపడితే రోదసిలోనూ వృక్షజాలాన్ని పెంపొందించవచ్చని శాస్త్రవేత్తలు అంటు న్నారు. సాధారణంగా వ్యోమగాములకు ఆహార పదార్థాలను భూమి నుంచి పంపి స్తుంటారు. తమ పరిశోధనలు ఫలిస్తే వ్యోమగాములు తమకు కావాల్సిన కూరగాయలు, ఆహార పదార్థాలు రోద సిలోనే సాగు చేసుకోవచ్చని చెప్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అంతరిక్షంలో జీవజాలం మనుగడకు ఏమాత్రం అనుకూలించని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వ్యోమగాములు సాధారణంగా తమకు కావాల్సిన ఆహార పదార్థాలను భూమి నుంచే తీసుకెళ్తుంటారు. కానీ భవిష్యత్తులో ఆ అవసరం ఉండబోదు. వ్యోమగాములు తమకు కావాల్సిన కూరగాయలు, ఆహార పదార్థాలను అక్కడే సాగుచేసుకోవచ్చు. ఆ దిశగా నాసాతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధనలను సాగిస్తున్నది. ఇందులో భాగంగా వనరులు తక్కువగా ఉన్న ప్రతికూల ప్రదేశాల్లో మొక్కలు పెరగడానికి ఉపయోగపడే జన్యువులను కలిగి ఉన్న పలు రకాల బ్యాక్టీరియాలను వారు ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన వివరాలు ఇటీవలి ప్రాంటియర్స్ ఆఫ్ మైక్రోబయాలజీ సంచికలో ప్రచురితమయ్యాయి.
మొక్కల పెరుగుదలకు దోహదపడే బ్యాక్టీరియాలు
సాధారణంగా డీప్ స్పేస్ మిషన్ల సమయంలో వ్యోమగాములు తమ మనుగడ కోసం ప్రాసెస్చేసిన ఆహార పదార్థాలను తీసుకెళ్తారు. అలా కాకుండా అంతరిక్షంలోనే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొనేందుకు గల సాధ్యాసాధ్యాలపై కొంత కాలంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ దిశగా ముఖ్యంగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్సన్ ల్యాబోరేటరీ (జేపీఎల్), అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్), వర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ సైన్సెన్స్ సంయుక్తంగా విస్తృత అధ్యయనం చేస్తున్నాయి. తాజాగా వారు నాలుగు కొత్త బ్యాక్టీరియాలను కనుగొన్నారు. ఇందులో ఒకటి మిథైలో బ్యాక్టిరాయాసీ కుటుంబానికి చెందినదిగా గుర్తించగా, మిగతా మూడింటిని గతంలో ఎవరూ కనుగొనలేదని తేల్చారు. వాటిని జన్యు విశ్లేషణచేయగా అవి మిథైలో బ్యాక్టీరియం ఇండికమ్తో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ కొత్త జాతి బ్యాక్టీరియాలకు అన్నామలై వర్సిటీకి చెందిన విశ్రాంత, ప్రఖ్యాత భారతీయ జీవవైవిధ్య శాస్త్రవేత్త డాక్టర్ అజ్మల్ఖాన్ పేరుతో ‘మిథైలో బ్యాక్టీరియం అజ్మాలి’ అని పేరు పెట్టారు. ఇక వాటిలో జన్యువులను మరింత లోతుగా విశ్లేషించగా ఆ బ్యాక్టీరియాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కలు పెరిగేందుకు ఎంతో దోహదపడతాయని గుర్తించారు. ఆ బ్యాక్టీరియాల్లోని జన్యువులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను తట్టుకోవడానికి మొక్కలకు సహాయపడటమేకాకుండా, ఇంధనాన్ని రూపొందించడంలోనూ ఎంతో దోహదపడతాయని కనుగొన్నట్టు పరిశోధనకు నాయకత్వం వహించిన హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అప్పారావు పొదిలె వివరించారు. అంతరిక్షంలో వ్యవసాయం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఇది మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. జేపీఎల్ సహకారంతో ఆ దిశగా మరింత లోతైన పరిశోధనలు సాగిస్తున్నామని చెప్పారు.