సినిమా ఇండస్ట్రీలో జరిగేది బిజినెస్. ఇక్కడ కేవలం లాభనష్టాలు మాత్రమే మాట్లాడతాయి. ఇంకా చెప్పాలంటే మనీ మ్యాటర్స్ అంటారు కదా.. అచ్చంగా సినిమా ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. నిర్మాత ఒక సినిమా చేస్తున్నాడు అంటే కేవలం డబ్బు కోసమే. అందులో మానసిక సంతృప్తి లాంటి పెద్దపెద్ద మాటలు వాడినా కూడా చివరికి కావాల్సింది డబ్బే. తాజాగా విషయంపై నిర్మాత సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో జరిగే బిజినెస్ లో తప్పు, ఒప్పులు ఉండవని.. ఇక్కడ అందరూ పని చేసేది డబ్బు కోసమే అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు. సినిమాలను కేవలం థియేటర్లో మాత్రమే విడుదల చేయాలి.. ఓటిటి సంస్థలకు ఇవ్వవద్దు అంటూ ఈ మధ్య తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి నిర్మాతలకు తమ విన్నపాన్ని తెలియజేశారు.
దీనికి కొందరు నిర్మాతలు సానుకూలంగా స్పందించారు. థియేటర్లలో విడుదల చేయకపోతే ఎగ్జిబిటర్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది అంటూ ఫిలించాంబర్ అభిప్రాయపడుతోంది. అందుకే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలని తేడా లేకుండా అన్నింటిని థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేయొద్దు అంటూ వారు కోరారు. అయినా కూడా వెంకటేష్ నటించిన నారప్ప సినిమాని జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఇంత పెద్ద సినిమాను నేరుగా విడుదల చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై సురేష్ బాబు మనసులో మాట బయట పెట్టాడు. కరోనా కారణంగా కేవలం ఎగ్జిబిటర్లు మాత్రమే కాదు నిర్మాతలు కూడా నష్టపోయారు.. ఇలాంటి సమయంలో ఎవరు తీసిన సినిమాను వారు స్వతంత్రంగా విడుదల చేసుకునే హక్కు ఉంటుంది.. మంచిరేటు వచ్చినప్పుడు థియేటర్లో కాకుండా వేరే ప్లాట్ ఫామ్ పై సినిమాను విడుదల చేసుకునే హక్కు నిర్మాతలకు ఉంటుంది.. బిజినెస్ లో తప్పొప్పులు చూడకూడదు అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు సురేష్ బాబు. థియేటర్లు తెరుచుకోవచ్చు అంటూ ప్రభుత్వం ఆదేశించిన తర్వాత కూడా ఎగ్జిబిటర్లు దీనికి ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు థియేటర్లు తెరిచేది లేదు అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేస్తున్నారు.