ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి అభిమానులందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అగ్ర కథానాయకుడు మహేష్బాబు. ఈ నెల 9న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన అభిమానుల్ని కోరారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, వాటినే తాను జన్మదిన కానుకలుగా భావిస్తానని మహేష్బాబు చెప్పారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా మహేష్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘భారీ అభిమానగణం కలిగిన మహేష్బాబు వంటి అగ్ర హీరో గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఆయన సహృదయత నా మనసుని కదిలించింది. మహేష్బాబు వంటి గొప్ప వ్యక్తుల సహకారంతోనే గ్రీన్ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకుసాగుతోంది. రేపటి తరం సుఖంగా జీవించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడమే మన కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్గారు తరచుగా చెబుతుంటారు. సీఎంగారి హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ను కొనసాగిస్తున్నాం’ అని ఎంపీ
సంతోష్కుమార్ పేర్కొన్నారు.