అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68), రవిచంద్రన్ అశ్విన్(3/47) మాయాజాలానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 205కే కుప్పకూలడంతో నాలుగో టెస్ట్ తొలి రోజు గురువారం టీమ్ఇండియాదే పైచేయిగా నిలిచింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ ఆటముగిసే సమయానికి 12 ఓవర్లలో 24/1 స్కోరు చేసింది. ఓపెనర్ రోహిత్(8) పాటు పుజారా(15) క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ డకౌట్ అయ్యాడు. జేమ్స్ ఆండర్సన్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడో బంతికే గిల్ ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు.
స్టోక్స్ ఒక్కడే..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత స్పిన్నర్ల దెబ్బకు ఇబ్బందిపడింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. బెన్స్టోక్స్(55: 121 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) మాత్రమే అర్ధసెంచరీతో రాణించాడు. మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు జాక్ క్రాలే(9), డొమినిక్ సిబ్లే(2)లను స్పిన్నర్ అక్షర్ పెవిలియన్ పంపడంతో ఇంగ్లీష్ జట్టు 15/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న బెయిర్స్టో(28) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా కెప్టెన్ జో రూట్(5) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.
వీరిద్దరినీ హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఔట్ చేయడంతో ప్రత్యర్థి టాప్ ఆర్డర్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. టీ విరామ సమయానికి 144/5తో నిలిచింది. ఇక ఆఖరి సెషన్లో అశ్విన్, అక్షర్ పోటీపడి వికెట్లు పడగొట్టారు. చివరి సెషన్లో డేనియల్ లారెన్స్(46) కాస్త దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 200కు చేరింది. జానీ బెయిర్స్టో(28), ఓలీ పోప్(29), జేమ్స్ ఆండర్సన్(10 నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.