బాలీవుడ్ అగ్రనటి కంగనారనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏడాదిన్నర కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. యువహీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతం నేపథ్యంలో హిందీ చిత్రసీమలోని మాఫియా రాజకీయాలు, వారసుల ఆధిపత్యంపై కంగనారనౌత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేసింది. అప్పటి నుంచి సందర్భాన్ని బట్టి మహా సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నది కంగనారనౌత్. తాజాగా థియేటర్ల వ్యవహారంపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాలు థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతినిచ్చాయని, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిత్రసీమపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టింది. ‘ఎన్నో సినిమాలు విడుదలకు నిరీక్షిస్తున్నాయి. ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. రాష్ట్రంలో థియేటర్ల సంస్కృతి కనుమరుగు కావాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా అనిపిస్తున్నది. సినీరంగంపై ఇంతటి వివక్ష చూపుతున్నా పరిశ్రమ మొత్తం మౌనంగా ఉంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నది’ అని కంగనారనౌత్ విమర్శలు సంధించింది. ‘తలైవి’ సినిమా విడుదల సందర్భంగా ముంబయిలో థియేటర్లకు అనుమతినివ్వాలని కంగనారనౌత్ చేసిన అభ్యర్థనను మహారాష్ట్ర సర్కార్ తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో అసంతృప్తిగా ఉన్న ఆమె తాజాగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.