ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు
మంత్రి ఈటల రాజేందర్
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
హుజూరాబాద్, మార్చి 19: నిరుపేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం కేసీ క్యాంపులోని మంత్రి కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 19 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. పేదలకు వరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని పేర్కొన్నారు. పేదలకు సర్కారు దవాఖానల్లో ప్రభుత్వం గతంలో కన్నా మెరుగైన వైద్యం అందిస్తున్నదని, దీంతో ప్రసవాల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. భవిష్యత్తులో సర్కారు దవాఖానల్లో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 19 మంది లబ్ధిదారులకు రూ.19,09,500 విలువైన చెక్కులను అందజేశారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ను ఈటల పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు బండ శ్రీనివాస్, గోపు కొంరారెడ్డి, గందె శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.