ఉద్యమాల గడ్డ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్నది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హాలియాలో నిర్వహించనున్న బహిరంగ సభ టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ను పెంచనున్నది. సీఎం సభతో కాంగ్రెస్ పరాజయం ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి.
హాలియా, ఏప్రిల్ 13: నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచార నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో టీఆర్ఎస్ బహిరంగసభకు హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ బహిరంగసభ ప్రాంగణానికి రానున్నారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గడిచిన ఏడేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన దాదాపు లక్షన్నర మంది సభకు హాజరుకావచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. వీరితోపాటు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు సభ వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలను మాస్క్లు ధరించి రావాలని పార్టీ శ్రేణులు సూచించాయి. సభాప్రాంగణం వద్ద మాస్క్లు, శానిటైజర్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య విజ్ఞప్తిమేరకు ఇదివరకే సీఎం కేసీఆర్.. కృష్ణపట్టె ప్రాంతానికి నెల్లికల్లు లిఫ్ట్, డీ 8, 9 డిస్ట్రిబ్యూటరీ కాల్వకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్లు మంజూరుచేశారు. దీంతోపాటు హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతించారు. నియోజకవర్గంలో అనేక సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులుచేపట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లుచేసింది. హాలియా పట్టణంలోని పెద్దవూర రోడ్డులో పాత ఐటీఐకి ఎదురుగా ఉన్న 20 ఎకరాల స్థలంలో సభను నిర్వహిస్తున్నారు. ప్రధాన సభావేదికతోపాటు పక్కనే కళాకారుల కోసం ప్రత్యేక వేదిక, వీఐపీ, మీడియా గ్యాలరీల ఏర్పాటు పూర్తయింది. సభాస్థలంలో ఎక్కువభాగం కవర్ అయ్యేలా కార్పెట్లను పరిచారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం కేసీఆర్ సభాస్థలికి వస్తారు.ఇందుకోసం సభా వేదిక పక్కనే ప్రత్యేక హెలిపాడ్ ఏర్పాటుచేశారు. సభకు వచ్చే వారి వాహనాల కోసం హాలియాకు మూడువైపులా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తిచేస్తున్నారు. శానిటైజర్ వినియోగించేలా చర్యలు చేపడుతున్నారు. సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పరిశీలించారు.
హాలియాకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో కాంగ్రెస్ నాయకుల్లో గుబులు పట్టుకున్నది. బహిరంగ సభకు సీఎం వస్తే ప్రజలు పూర్తిగా మారిపోతారని, ఇప్పటివరకు అంతో ఇంతో ఉన్న బలం, బలగం కూడా పోతుందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందనే, బహిరంగసభను అడ్డుకొనేందుకు హైకోర్టులో కేసు వేయించారని, హైకోర్టు దాన్ని కొట్టివేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ తమ పొలాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సభను ఆపేలా ఆదేశించాలంటూ రైతులు గోలి సైదిరెడ్డి, గోలి శ్రీనివాస్రెడ్డి మంగళవారం దాఖలుచేసిన హౌస్మోషన్ పిటిషన్ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి (సీజీ) నిరాకరించారు. వీరి అభ్యర్థనను సీజే తిరస్కరించినట్టు రిజిస్ట్రీ అధికారులు పిటిషనర్ తరపు న్యాయవాదులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరి పిటిషన్లు గురువారం జస్టిస్ కే లక్ష్మణ్ ముందు విచారణకు రానున్నాయి.