‘సినీ నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయి. లాభాలు మాత్రం రావడం లేదు. అందుకు చాలా కారణాలున్నాయి. ఇండస్ట్రీ సాధకబాధకాల్ని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించాం. ప్రభుత్వాలు మా సమస్యలపై కనికరించాలి. మా భయాల్ని పోగొడుతూ సినీ పరిశ్రమకు భరోసానివ్వాలి’ అని అన్నారు అగ్రహీరో చిరంజీవి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకుడు. నారాయణ్దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మాతలు. ఈ నెల 24న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్రహీరో చిరంజీవి, బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేటు ఎప్పుడూ ఇరవై శాతానికి మించదు.
ఈ విజయాలకే ఇండస్ట్రీ కళకళలాడుతుందని అందరూ అపోహపడుతున్నారు. ఇండస్ట్రీని నమ్ముకొని కష్టించి పనిచేసే వారు వేల మంది ఉన్నారు. వీరందరు కలిస్తేనే ఇండస్ట్రీ తప్పితే కొంత మంది హీరోలు, దర్శకునిర్మాతలది కాదు. సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలు డబ్బు సంపాదించే దర్శకులు కొంతమందే ఉంటారు. వారి కోసం మిగతావాళ్లు ఇబ్బందులు పడే నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తులు కాదు మా అవసరాల్ని తీర్చమని అడుగుతున్నాం. ‘ఆచార్య’తో పాటు ఇండస్ట్రీలో చాలా సినిమాల షూటింగ్లు పూర్తయ్యాయి. కానీ ఆ సినిమాల్ని ఎప్పుడు, ఎలా విడుదల చేయాలో అర్థంకాని పరిస్థితి ఉంది. ఈ భయాల్ని పోగొడుతూ ప్రభుత్వాలు ఇండస్ట్రీకి భరోసాను కల్పించాలి. యువతరం హీరోల్లో నాగచైతన్య విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ నిదానంగా ముందుకు సాగుతున్నారు. నా చిరకాల స్నేహితుడు ఆమిర్ఖాన్ను చాలా ఏళ్ల తర్వాత ఈ వేడుక ద్వారా మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. నేను హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నా సోదరి పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకోవాలని అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల కుదరలేదు. సాయిపల్లవితో డ్యాన్స్ చేయాలని అనుకుంటాను కానీ సోదరిగా నా పక్కన తనను ఊహించుకోలేను(నవ్వుతూ)’ అని అన్నారు.
థియేటర్లో ‘లవ్స్టోరి’ని చూస్తా
ఆమిర్ఖాన్ మాట్లాడుతూ ‘నాలుగురోజుల క్రితం ‘లవ్స్టోరీ’ ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. చైతూకి మెసేజ్ చేసి బాగుందని చెప్పాను. చైతన్య, నేను ఇద్దరం కలిసి హిందీలో ‘లాల్సింగ్ చద్దా’ సినిమా చేస్తున్నాం. నాగచైతన్య గొప్ప మనసున్న వ్యక్తి. అతనితో పనిచేస్తుంటే ఎంతోకాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. ఈ సినిమాను చూడాలని నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మొదటి రోజు థియేటర్లోనే సినిమా చూస్తా. ముంబయిలో ఎక్కడైనా స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ సినిమా చూడాలనుకుంటున్నా. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఇబ్బందులు దూరమయ్యాయి కాబట్టి థియేటర్లోనే ఈ సినిమా చూడాలి. చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆమిర్ఖాన్ ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.
వివక్ష గురించి చర్చించాను
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘కాలేజీ రోజుల నుంచి ఆమిర్ఖాన్ అభిమానిని. ఆయన సినిమాలు నాపై బలమైన ముద్రను వేశాయి. ‘లీడర్’ సినిమాలోని ఓ డైలాగ్లో అరవై ఏళ్ల స్వాతంత్య్రంలో ఇంకా కుల వివక్ష ఉందని చెప్పాను. ఆ పాయింట్తో పాటు లింగ వివక్షను టచ్ చేస్తూ ఈ సినిమా తీశా. ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. అడ్వాన్స్డ్ బుకింగ్ బాగా జరుగుతున్నది. యు.ఎస్.లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నది’ అన్నారు.
నటుడిగా పరిణితి వచ్చింది
నాగచైతన్య మాట్లాడుతూ ‘ఆమిర్ఖాన్ ట్రైలర్ చూసి వేడుకకు వస్తానని చెప్పడం ఆనందంగా అనిపించింది. ఆయనతో కలిసి ‘లాల్సింగ్ చద్దా’ సినిమా కోసం నలభై ఐదు రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆయనతో గడిపిన రోజులు జీవితాంతం గుర్తుండిపోతాయి. కెరీర్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో మంచి నటుడిగా, హ్యూమన్ బీయింగ్గా ఎంతో పరిణితి వచ్చింది. సమాజంలో నెలకొన్న సమస్యలను గురించి ప్రజలకు బలంగా చెప్పే అవకాశం ఈ సినిమాతో దొరికింది’ అని చెప్పారు. క్రమశిక్షణ, కథ, పాత్రల ఎంపికలో ఆమిర్ఖాన్ను స్ఫూర్తిగా తీసుకుంటానని, ఆయన్ని కలవాలనే కల నిజమైందని, మౌని లాంటి క్లిష్టమైన పాత్ర చేసే అవకాశం దొరకడం అదృష్టమని సాయిపల్లవి చెప్పింది.