న్యూఢిల్లీ: ప్రముఖ బెంగాలీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత బుద్ధదేవ్ దాస్ గుప్తా (77) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నారు. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే నుంచి ప్రేరణ పొందిన బుద్ధదేవ్ దాస్ గుప్తా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
ఆయనకు ‘బాగ్ బహదూర్’, ‘తహదర్ కథ’, ‘చరాచార్’, ‘ఉత్తర’ వంటి సినిమాలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. బుద్ధదేవ్ దాస్ గుప్తా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
‘బుద్ధదేవ్ దాస్గుప్తా మరణంతో చాలా బాధపడ్డాను. ఆయన వైవిధ్యభరిత రచనలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాలకు అద్ధం పడతాయి. ఆయన గొప్ప తత్వవేత్త, కవి’ అని ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘ప్రముఖ చిత్రనిర్మాత బుద్ధదేవ్ దాస్గుప్తా మరణం విచారకరం. ఆయన తన రచనలతో తన సాహిత్యాన్ని సినీలోకానికి పరిచయం చేశారు. ఆయన మరణం సినీలోకానికి చాలా నష్టం. ఆయన కుటుంబానికి, సహచరులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు.