ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
8వ డివిజన్లో డ్రైనేజీ, ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన
కార్పొరేషన్/ కమాన్చౌరస్తా, మే 31: నగరానికి తొలిగడపలా ఉన్న అల్గునూర్ను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. 8వ డివిజన్లో రూ. 24 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం నగర మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్ సల్ల శారదా రవీందర్తో కలిసి శంకుస్థాపన చేశారు. వీటిలో రూ. 19 లక్షల వ్యయంతో డ్రైనేజీ, రూ. 5 లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ, డివిజన్లో ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అల్గునూర్లో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం తమ చిరకాల స్వప్నం అని, అందుకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఐలాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో అల్గునూర్ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
విలీన గ్రామాల అభివృద్ధ్దికి ప్రత్యేక నిధులు
నగరంలో విలీనమైన గ్రామాల అభివృద్ధి కోసం నగరపాలక సంస్థ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మేయర్ వై సునీల్రావు తెలిపారు. 8వ డివిజన్లో రూ. 1.70 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని, దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. శివారు డివిజన్లలో ప్రాధాన్య క్రమంలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి ఈ డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అల్గునూర్ వరకే ఉన్న సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఎల్ఎండీ గెస్ట్హౌస్ వరకు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితాఆంజనేయులు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, డివిజన్ నాయకులు జాప శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, అధికారులు శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.