హైదరాబాద్ : తెలంగాణలో జూన్ చివరినాటికి రెండో వేవ్ అదుపులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 4.1 శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.47 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.52 శాతంగా.. మరణాల రేటు 0.56 శాతంగా ఉందని వివరించారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3.82 శాతం కొవిడ్ బారినపడ్డారు. 1500 కేంద్రాల్లో కొవిడ్ ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. 2.70 లక్షల మందిలో కొవిడ్ లక్షణాలు గుర్తించి మందులు ఇచ్చాం. ఫీవర్ సర్వేలో 33 వేల బృందాలు పాల్గొన్నాయి. ఆరోగ్య సిబ్బంది కోటి లక్షన్నర ఇళ్లను సర్వే చేశారు. ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలు 1200కు పెంచాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా ఎక్కువగా ఉంటోంది.
40 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 56 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశాం. ప్రస్తుతం 6.18 లక్షల కొవిషీల్డ్ డోసులు, 2.5 లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. జూన్ మొదటి వారంలో మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయి. జూడాలు, సీనియర్ రెసిడెంట్ల డిమాండ్లకు సీఎం ఆమోదం తెలిపారు. సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం వేతనం పెంచాం. విధుల్లో చేరాలని జూడాలకు సీఎం తెలిపారు.’’ ని డీహెచ్ జీ శ్రీనివాస రావు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.