నీలగిరి, మే 25 : నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలో సీటీ స్కాన్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం దవాఖానలోని క్యాజువాలిటీ, ఓపీ బ్లాక్, దవాఖాన ఆవరణ, వార్డుల్లో కలియ తిరిగారు. ఆవరణలో చెత్త లేకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఓపీ వార్డులో పేషెంట్లు భౌతికదూరం పాటించేలా సర్కిళ్లు గీయించాలని సూచించారు. వివిధ వార్డుల్లో ప్లంబర్, ఎలక్ట్రిక్ పనులు, టాయిలెట్స్ రిపేరులు ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు. డాక్టర్లకు క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఓపీ బ్లాక్ షిప్టింగ్ నిర్మాణ పనులు 15రోజుల్లోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్తో సమావేశమై సమస్యలపై చర్చించారు. దవాఖానలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి నిధులు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ రాథోడ్ జైసింగ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి, వైస్ ప్రిన్సిపాల్ నిత్యానంద, నోడల్ అధికారి రమణమూర్తి, గైనకాలజిస్టు డాక్టర్ సుచరిత, ఆర్ఎంఓ ప్రశాంత్, స్వప్న తదితరులు ఉన్నారు.
నేటి నుంచి కరోనా పరీక్షలు
జిల్లాలోని అన్ని పీహెచ్సీ, యూహెచ్సీల్లో కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు జిల్లా కేంద్రంలోని దవాఖాన, ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, పీహెచ్సీల్లో పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.