ఖలీల్వాడి మే 3 : నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో కొంతమంది ప్రైవేటు వైద్యులు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుంటే మరోవైపు ప్రైవేటు వైద్యులు కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవల కాలంలో కొంత మంది వైద్యులకు కరోనా సోకినా రోగులకు చికిత్సలు అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. మరొకరు ఏకంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్ బాటిళ్లలో గ్లూకోజ్ వాటర్ కలిపి ప్రజల ప్రాణాల మీదకు తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జిల్లా యంత్రాగం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేటు దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే పలు దవాఖానల్లో దాడులు మొదలయ్యాయి. టాస్క్ఫోర్స్ అధికారులు ప్రతి పేషెంట్ వద్దకు వెళ్లి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వాడకం, వాటి నిల్వలు, వాటి కొనుగోలు వివరాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేసే దవాఖానలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా సీజ్ చేయడానికి అధికారులు వెనుకాడడం లేదు. పరిస్థితిపై కలెక్టర్ నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు, సెల్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేదిలేదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నా.. రికవరీలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో వేల సంఖ్యలో కొవిడ్ నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఇండ్లకు వెళ్తున్నారు.
జిల్లా వ్యా ప్తంగా కొవిడ్కు సంబంధించిన మందులను అధిక ధరలకు అమ్మినా, నకిలీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్మినా వెంటనే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. ఇష్టరాజ్యంగా వ్యవహరించే ప్రైవేటు దవాఖానలకు నోటీసులు జారీ చేయాలని ఇప్పటికే జిల్లా వైద్యాఆర్యోగశాఖ అధికారి బాలనరేంద్రకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు దవాఖానల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కలెక్టర్ పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
ప్రభుత్వ దవాఖానల్లో 521 పైగా బెడ్లు ఉన్నాయి. ఆర్మూర్లో 80, బోధన్లో 100 బెడ్లు ఉండగా వేలాది మంది దవాఖానల్లో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేటు దవాఖానలు మొత్తం కలిపినా కరోనా ట్రీట్మెంట్ చే సేందుకు 200 బెడ్లు లేవు. తప్పడు సమాచారం, సోష ల్ మీడియాలో అసత్యపు ప్రచారంతో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మం త్రి, ఎమ్మెల్సీలు లక్షలు ఖర్చు పెట్టి రెమ్డెసివిర్ ఇంజక్షన్లను దవాఖానకు తెప్పిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ దవాఖానలకు వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న మందుల కిట్తో ఐదు నుంచి ఏడు రోజుల్లోనే కరోనాను నయం చేసుకోవచ్చనని వైద్యులు సూచిస్తున్నారు.