మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం కాంపల్లి శివారులోని బీల్యా తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన బానోతు మన్సూర్ – సునీత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్న కుమారుడు మన్విత్(3) ఇంట్లో ఆడుకుంటూ బయటకు వచ్చి జంక్షన్ బాక్సులో చేయి పెట్టాడు. దీంతో విద్యుత్ షాక్కు గురై ఆ బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. విషయాన్ని గమనించిన సునీత తన కుమారుడిని తీసుకుని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాబు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
అప్పటివరకు ఇంట్లో తమ కండ్ల ముందు అల్లారుముద్దుగా ఆడుతూ పాడుతూ తిరిగిన బాబు ఇక లేడు అని తెలియడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. చుట్టుపక్కల వారు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.