శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మహిళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీనియర్ నటీమణులు ఖుష్బూ, రాధికా శరత్కుమార్, ఊర్వశి కీలక పాత్రల్లో నటిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. ‘కథానుగుణంగా ముగ్గురు మహిళల పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అపారమైన అనుభవం, అద్భుత ప్రతిభాపాటవాలు కలిగిన తారలు అయితేనే న్యాయం చేయగలరనే ఉద్దేశ్యంతో ముగ్గురు సీనియర్లను ఎంపిక చేశాం. సినిమాలో వీరి పాత్రలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న చిత్రీకరణలో వీరు పాల్గొంటున్నారు’ అని చిత్రబృందం తెలిపింది. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్సారంగ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం: కిషోర్ తిరుమల.