కరోనా కట్టడికి అన్నీ బంద్..
కేసుల వ్యాప్తితో బిక్కుబిక్కుమంటూ..
ఇండ్లకే పరిమితమైన ఉమ్మడి జిల్లా వాసులు
ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ సహకారం
కరోనా వారియర్స్కు చప్పట్లతో సంఘీభావం
మరుసటి రోజు నుంచే లాక్డౌన్
కళ్ల ముందే నాటి ఘడియలు
నిర్మల్ టౌన్, మార్చి 21: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుండగా, కేంద్ర, రాష్ర్టాలు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సరిగ్గా ఏడాది క్రితం(మార్చి 22న) జనతా కర్ఫ్యూకు పిలుపు నిచ్చాయి. ఈ ప్రకటనకు ఉమ్మడి జిల్లా వాసులు సంపూర్ణంగా సహకరించారు. బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏకధాటిగా 14 గంటల పాటు రోడ్లెక్కకుండా ఇండ్లకే పరిమితమయ్యారు.
భయం భయంగా ఉమ్మడి జిల్లా..
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో గతేడాది మార్చి 22న దేశ వ్యాప్తంగా నిర్వహించిన జనతా కర్ఫ్యూలో ఉమ్మడి జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అప్పటికే జిల్లాలో మర్కజ్ నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్లుగా వార్తలు వెలువడడంతో, అధికారులంతా అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించే పనిలోనూ నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు విదేశాల నుంచి పలువురు జిల్లాకు చేరుకున్నారు. ఇందులో ఎంత మందికి ఆ మహమ్మారి సోకిందో తెలియక జిల్లా ప్రజలు భయంతో గడిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఇచ్చిన పిలుపుతో గతేడాది మార్చి 22న ఉమ్మడి జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిచి పోయాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనం ఇండ్ల నుంచి బయటికి కదల్లేదు. సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఇండ్ల ముందుకు వచ్చి కరోనా వారియర్స్గా సేవలందిస్తున్న వైద్యులకు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.
స్వచ్ఛందంగా బంద్ పాటించిన జనం..
ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కనీసం ఆటోలు కూడా నడవలేదు. రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జనతా కర్ఫ్యూ గురించి ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయడంతో ముందు రోజే అవసరమైన నిత్యావసరాలు సమకూర్చుకున్న జనం ఒక్క క్షణం కూడా బయటికి రాలేదు. నిత్యం రద్దీగా ఉండే మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించడం మినహా పోలీసులు పహారా కాయాల్సిన అవసరం లేకుండా కర్ఫ్యూ స్వచ్ఛందంగా జరిగింది..
మరుసటి రోజు నుంచే లాక్డౌన్
జనతా కర్ఫ్యూ విజయవంతమైన మరుసటి రోజు(మార్చి 23) నుంచే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. మొదట అదే నెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగింది. ఆ తర్వాత మే 5 తర్వాత కొన్ని ఆంక్షలు సడలించి అదే నెల 29 వరకు అంటే దాదాపు 45 రోజుల పాటు లాక్ డౌన్ జిల్లాలో అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇండ్ల నుంచి బయటి రాకుండా పోలీసులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ శాఖల విధులు కూడా స్తంభించి పోయాయి. లాక్డౌన్ సడలించిన మే 5న ఉదయం, సాయంత్రం జనాలను బయటకు రానిచ్చారు. కావాల్సిన నిత్యావసరాలు కొనుక్కొని తిరిగి ఇండ్లకే పరిమితమయ్యారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. వలస కూలీలను కూడా అక్కున చేర్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున చెల్లించింది. కాగా, వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. కూలీలకు ఉపాధి కరువైంది. కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోలుకున్న జిల్లా ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇప్పటికీ వ్యక్తిగత భద్రతతోనే బయట తిరుగుతున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కరోనా జనజీవనంలో పూర్తి మార్పు తెచ్చింది. మాస్కు, శానిటైజర్ను తప్పనిసరి చేసింది.
ధైర్యంతో విధులు నిర్వర్తించిన..
గతేడాది నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ మొదట మరణంతోనే ప్రారంభమైంది. ఒక్కసారిగా జిల్లా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రతిరోజు కంటైన్మెంట్ జోన్లలో కరోనా సోకిన వారికి వైద్యం అందించడమే కాకుండా దవాఖానలో చేరిన వారికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వైద్యం చేశాం. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేశాం. అది మా జీవితంలో ఒక్క గొప్ప అనుభూతినిచ్చింది.
డాక్టర్ దేవేందర్రెడ్డి
రోడ్లపైనే జాగారం చేశాం..
గతేడాది మార్చి 22న ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలు ఇంట్లోనే ఉండిపో యారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చే వారికి పోలీసుగా అన్ని విధాలా సహాయం అందించా. రాత్రనకా.. పగలనక కంటైన్మెంట్ జోన్లలో కంటికి రెప్పలా కరోనా బారిన పడకుండా ప్రజలకు రక్షణ కల్పించాం. మూడు నెలల పాటు రోడ్లపై నే డ్యూటీ. కరోనా భయం మమ్మల్ని వెంటాడేది. మేం కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, ఉన్నతాధికారుల సూచనలు పాటించేవాళ్లం. ఆ రోజులు గుర్తుచేసుకుంటేనే ఎంతో బాధ అన్పి స్తది. ఆపత్కాలంలోనూ ధైర్యంగా విధులు నిర్వర్తించడం గర్వంగా కూడా అన్పిస్తది.
సైఫొద్దీన్, కానిస్టేబుల్