హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరి ప్రాణాలు తీసేలా ఉసిగొల్పింది. గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం సీపీ అంజనీకుమార్ వివరాలు మీడియాకు వెల్లడించారు. గోల్కొండ రిసాలాబజార్కు చెందిన ఎండీ అజ్జు, శంషాబాద్కు చెంది న మహ్మద్ ఇర్ఫాన్ ఆటో ట్రాలీ డ్రైవర్లుగా పనిచేసేవారు. అజ్జు ఆసిఫ్నగర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. కొన్నిసార్లు అజ్జును ఇర్ఫాన్ బండిపై ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టేవాడు. ఈ క్రమంలో మహిళ విషయంలో ఇర్ఫాన్, అజ్జు గొడవపడ్డారు. దీంతోపాటు తాను ప్యాసింజర్ ఆటో కొనుగోలు చేసేందుకు ష్యూరిటీ ఇవ్వలేదని అజ్జుపై ఇర్ఫాన్ కోపం పెంచుకున్నాడు. గతనెల 5న ఇద్దరు రేషంబాగ్ ప్రాంతంలోని బావి వద్దకు వెళ్లారు. ముందు నీళ్లలోకి వెళ్లిన ఇర్ఫాన్.. అజ్జును కూడా రావాలని కోరాడు. అతడు నిరాకరించడంతో అజ్జును బావిలోకి తోసేసి పరారయ్యాడు. మరుసటి రోజు బావిలో మృతదేహం తేలి విషయం బయటకొచ్చింది. హత్య సమయంలో ముగ్గురు పిల్లలు బావివద్ద ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. వారిని విచారించారు. ఇర్ఫానే చంపినట్టు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. సమావేశంలో ఆసిఫ్నగర్ ఏసీపీ శివ మారుతి, ఇన్స్పెక్టర్ కే చంద్రశేఖర్రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు.