హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్ది ఆత్మగౌరవం కాదని.. ఆత్మద్రోహమని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈటల బీసీనని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయన పార్టీకి గానీ, నాయకుడికి గానీ లాయల్గా లేడని, ప్రజలవైపు అసలే లేడని పేర్కొన్నారు. ఆస్తులను కూడబెట్టుకునేందుకే మంత్రి పదవిని వాడుకున్నాడని.. ఇలాంటివ్యక్తి రాజకీయాలకు పనికిరాడని చెప్పా రు. ఆయన ముమ్మాటికీ పేదలు, బడుగువర్గాలకు ద్రోహంచేశాడని విమర్శించారు. ఓ బీసీ నేత ఎదుగుతున్నాడని తనలాంటివాళ్లం సంతోషపడ్డామని, చివరకు వారి భూములనే కబ్జాపెట్టడం సిగ్గుచేటని చెప్పారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి దళితుల భూములను కబ్జా పెట్టడమేమిటని ప్రశ్నించారు. కబ్జాచేసిన భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరటం హాస్యాస్పదమన్నారు. మంత్రి గా ఈటల బీసీల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదవర్గాల ప్రయోజనాల కోసం ఏనాడూ మాట్లాడని ఆయన నేడు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం విడ్డూరమన్నారు. కబ్జాపెట్టిన భూములను ఎవరి దగ్గరి నుంచి తీసుకున్నారో వారికే అప్పగించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బొమ్మపెట్టుకొని పూజించాలి
ఈటల అనే సామాన్యుడికి కేసీఆర్ అపార అవకాశాలు కల్పించారని మోత్కుపల్లి చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా ఈటల జీవితాంతం కేసీఆర్ ఫొటో పెట్టుకొని పూజించాలన్నారు. ఆస్తుల సంపాదనకు మాత్రమే లాయల్గా ఉన్న ఈటలకు ఉద్యమకారుడిగా చెప్పుకొనే నైతిక హక్కులేదని మండిపడ్డారు. ఒక పార్టీ అనేక అవకాశాలు ఇచ్చి, నాయకుడిగా ఎదిగే వేదికను ఏర్పాటుచేస్తే వాటిని అడ్డంపెట్టుకొని అక్రమంగా వేలకోట్ల సంపాదించినవాడిని లీడర్ అంటారా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం బతికేవాడు లీడర్.. ప్రజల కోసం చచ్చేవాడు లీడర్ అని పేర్కొన్నారు. ఈటల మాత్రం ఆస్తుల కోసం బతికేవాడు.. ఆస్తుల కోసమే పాకులాడేవాడని విమర్శించారు.