వరంగల్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ అమలు చేస్తున్నది. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. కరోనా నివారణ కోసం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో దాని చైన్ను బ్రేక్ చేసే దిశగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రోజూ పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించుకునేలా అనుమతినిచ్చింది. వైద్య సేవలు, సేవా రంగాలు, పంటల కొనుగోలు, వ్యవసాయ రంగానికి ఎక్కడా ఆటంకం కలుగకుండా చేసింది. కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, లాక్డౌన్ను చివరి అస్త్రంగానే భావించింది.
వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండడం, ఎప్పటి వరకు తగ్గుతుందనే అంచనాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ను అమలు చేయాలని నిర్ణయించింది. లాక్డౌన్ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచీ సానుకూల స్పందన వస్తున్నది. గ్రామాల నుంచి నగరాల వరకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలవుతున్నది. వ్యాపారులు, ప్రజలు ఎవరికి వారు నిర్దేశించిన సమయంలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా గ్రామాల్లోనూ కొన్ని గంటల వరకే కార్యకలాపాలు ఉండేలా పంచాయతీలు తీర్మానాలు చేసి అమలు చేస్తున్నాయి. పట్టణాలు, నగరం, కాలనీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇదే తీరుగా నిర్ణయం తీసుకుంది.
గత అనుభవాలు..
కరోనా వ్యాప్తి నివారణ కోసం గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వచ్చింది. అందిరికీ ఇది కొత్తగా అనిపించింది. ప్రపంచాన్ని ఆగం చేస్తున్న కరోనాను నియంత్రించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలైంది. గతేడాది మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలై.. మరుసటి రోజు నుంచి లాక్డౌన్ అమలైంది. అలా వరుసగా రెండు నెలలు దాదాపు పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలైంది. వైరస్ ఉధృతి తగ్గుదలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వచ్చింది. లాక్డౌన్తో వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయి వేలాది మందికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. లాక్డౌన్లోనూ అన్ని వర్గాల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం, నగదు పంపిణీ చేసింది. దశల వారీగా లాక్డౌన్ను ఎత్తి వేస్తూ వచ్చింది. పంటల కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం కొనసాగించింది. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా చూసింది. కరోనా రెండో దశ వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నది. వైరస్ సోకిన వారికి వైద్య సేవలు అందిస్తున్నది. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో మరోసారి లాక్డౌన్ విధించింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఉదయం 6నుంచి 10గంటల వరకు సడలింపు ఉంది కదా అని ఒక్కసారిగా బయటకు రావొద్దు. బయట గుంపులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలి. షాపులు వద్ద భౌతికదూరం పాటిస్తూ కావాల్సినవి కొనుక్కోవాలి. క్యూలైన్లలోనూ ఒకరిపై ఒకరు పడినట్లుగా ఉండకూడదు. ముఖ్యంగా లక్షణాలు లేకుండా పాజిటివ్ ఉన్న వ్యక్తులు బయటకు రాకూడదు. వారు కచ్చితంగా హోం క్వారంటైన్లో ఉండాలి. ఇంట్లో కూడా కుటుంబసభ్యులు మాస్కులు ధరించి ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
మంచి నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ ముదురుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించి మంచి నిర్ణయం తీసుకున్నది. దీని వల్ల ప్రజలు బయటకు రాకుండా ఉంటారు. ప్రజలు బయట తిరగడం మానేస్తే 90శాతం కేసులు రావు. లాక్డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. నిత్యావసరాల కోసం ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మినహాయింపు ఇవ్వడం బాగుంది. లాక్డౌన్ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
వైరస్ వ్యాప్తి తగ్గుతుంది
కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నది. వైరస్ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ తప్పనిసరి పెట్టాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. లాక్డౌన్తో వైరస్ వ్యాప్తి చాలామట్టుకు తగ్గుతుంది. ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. ఉదయం పూట మినహాయింపు ఇవ్వడం వల్ల అటు వ్యాపారులకు, ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
మానుకోటలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్
లాక్డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే మానుకోట జిల్లాలో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. మద్యం షాపులు, కూరగాయల మార్కెట్, కిరాణా షాపులు, ఇతర నిత్యావసరాల షాపుల వద్ద బారులు తీరారు. దీంతో రోడ్లపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వైన్స్షాపుల ముందు మందుబాబులను అదుపు చేసేందుకు నిర్వాహకులు అష్టకష్టాలు పడ్డారు. ఒక దశలో ఫోన్ చేసి పోలీసులను రప్పించారు. నెహ్రూసెంటర్, ఇందిరాగాంధీ సెంటర్, మూడుకొట్లు, మథర్ థెరిస్సా సెంటర్, మహబూబాబాద్ బస్టాండ్ ప్రాంతాలు రద్దీగా మారాయి.