కీసర, జూలై 6 : నాశక్తినంత ధారపోసి రెండేండ్లలో సమస్యల రహిత కీసరగా మారుస్తానని.. రాజ్యసభ సభ్యులు, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. శ్రీ రామలింగేశ్వరస్వామి దయతో కీసరను దత్తత తీసుకున్నానని., అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమానికి మంగళవారం ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై.. మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి కీసర పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కీసరగుట్టకు వెళ్లే దారిలో పెద్దమ్మ చెరువు పక్కన ఉన్న కమ్యూనిటీహాల్ను ప్రారంభించారు. అదేవిధంగా కీసర బస్టాండ్లోని అమరవీరుల స్తూపం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ పనులకు, ఎన్ఎన్రెడ్డి కాలనీ, శివాజీనగర్ కాలనీ, కీసర ప్రధాన చౌరస్తాలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ రెండేండ్లలో కీసరలో అసలు సమస్యలు అనేవి లేకుండా చేస్తానని, కీసరకు ఏం కావాలో, ఎన్ని సమస్యలున్నాయో వెంటనే రాసుకొని నా దగ్గరికి రావాలని సర్పంచ్ నాయకపు మాధురివెంకటేశ్కు సూచించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైఎస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీ నారాయణ శర్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.