న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 40,845 బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్తో బాధపడుతూ 3129 మంది మరణించారని తెలిపారు. కొవిడ్-19పై అత్యున్నత మంత్రుల బృందం 29వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కేసుల్లో 85.5 శాతం కేసులు కొవిడ్-19 రోగుల్లో వెలుగుచూడగా, వీరిలో 64 శాతం మంది మధుమేహంతో బాధపడేవారున్నారని తెలిపారు.
మరికొందరికి స్టెరాయిడ్స్ వాడటంతో బ్లాక్ ఫంగస్ సోకిందని చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసుల్లో 18 నుంచి 45 ఏండ్ల లోపు వారు 32 శాతం కాగా, 45 నుంచి 60 ఏండ్ల మధ్యవయస్కులు 42 శాతం మంది ఉన్నారని, 60 ఏండ్లు పైబడిన వారు 24 శాతం మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోందని వ్యాక్సిన్ డోసుల్లో అమెరికాను మనం అధిగమించామని డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.