న్యూఢిల్లీ : దేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. కొకైన్, హెరాయిన్ తదితర మత్తుపదార్థాలను పాక్ నుంచి పెద్ద ఎత్తున అక్రమార్కులు దేశంలోకి తరలిస్తున్నారు. ఇప్పటికే చోట్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోగా.. తాజాగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బుధవారం అర్ధరాత్రి 56 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూ.275 కోట్ల విలువ ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది. పాక్ నుంచి స్మగ్లర్లు నిషేధిత మత్తుపదార్థాలను రాజస్థాన్లో సరిహద్దు దాటించే ప్రయత్నం చేస్తుండగా.. అనుమానాస్పద కదలికలను బీఎస్ఎఫ్ గమనించి కాల్పులు జరిపింది. దీంతో అక్కడి నుంచి స్మగ్లర్లు పారిపోయారు. అనంతరం అక్కడికి వెళ్లి పరిశీలించగా.. 56 కిలోల బరువున్న 54 ప్యాకెట్ల హెరాయిన్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.